Chandrababu: వదల చంద్రబాబు.. నిన్నొదలం అనేలా వెంటబడుతున్నారు పోలీసులు. ఆయన ఎక్కడికి వెళితే అక్కడ పోలీస్ ఆంక్షలు విధిస్తున్నారు. బాబు పర్యటనలకు అడుగడుగునా ఆటంకాలు కలిగిస్తున్నారు. ఇటీవల కుప్పం పర్యటనకు వెళ్లకుండా టీడీపీ అధినేతను అడ్డుకున్న పోలీసులు.. ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాలో బాబు టూర్ కు బ్రేకులు వేస్తున్నారు.
ముందు పర్మిషన్ ఇస్తారు.. చంద్రబాబు వచ్చే వరకూ వెయిట్ చేస్తారు.. అప్పుడు అనుమతి లేదంటూ అడ్డుకుంటారు.. ఇలా ప్రత్యామ్నాయం లేకుండా చేసి.. సమయం చిక్కకుండా చేసి.. పోలీసులు వ్యూహాత్మకంగా చంద్రబాబు పర్యటనలను అడ్డుకుంటున్నారని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. పోలీసుల తీరుతో అనపర్తిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దేవీచౌక్ సెంటర్లో పోలీసులు, టీడీపీ వర్గాలకు మధ్య తోపులాట జరిగింది.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో, చంద్రబాబు పర్యటనలో మూడోరోజు పోలీసులు ఆంక్షలు విధించారు. అనపర్తి దేవీచౌక్ సెంటర్లో చంద్రబాబు పర్యటనకు గురువారం అనుమతి ఇచ్చిన పోలీసులు.. తాజాగా పర్మిషన్ లేదంటూ అడ్డుకున్నారు.
పోలీసుల తీరుపై టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. దేవీచౌక్ సెంటర్లోనే రోడ్ షో ఉంటుందని తేల్చి చెప్పాయి. చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించాయి.
జిల్లాలో చంద్రబాబు రెండ్రోజుల సభలకు వచ్చిన ప్రజా స్పందన చూసి ఓర్వలేకే.. పోలీసులు అనుమతి లేదంటున్నారని మండిపడుతున్నారు టీడీపీ వర్గీయులు. పోలీసుల ఆంక్షలను లెక్కచేయకుండా దేవీచౌక్ సెంటర్కు భారీగా చేరుకున్నారు. వారిని అడ్డుకునేందుకు పెట్టిన బారికేడ్లను తోసుకుంటూ కార్యకర్తలు దూసుకొచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. అనపర్తిలో ఉద్రిక్తత నెలకొంది.
అటు, అనపర్తికి రాకుండా చంద్రబాబు కాన్వాయ్ ని బలభద్రపురం దగ్గర అడ్డుకున్నారు పోలీసులు. దీనిపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ శ్రేణులు ఆయనకు మద్దతుగా ముందుకొచ్చారు. అయినా, పోలీసులు కాన్వాయ్ ను కదలనీయకపోవడంతో.. కారు దిగి కాలినడకనే దేవీచౌక్ సెంటర్ కు బయలుదేరారు చంద్రబాబు.
ఎంతమందిపై కేసులు పెడతారో చూస్తాం.. మా కార్యకర్తలను అరెస్ట్ చేయాలంటే పోలీస్ స్టేషన్లు సరిపోవు.. రౌడీరాజ్యం అంతం చేసేందుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందంటూ.. టీడీపీ అధినేత చంద్రబాబు పోలీసులపై విరుచుకుపడ్డారు.