Pawan Kalyan: విశాఖలో వారాహి విజయయాత్ర హైటెన్షన్ క్రియేట్ చేస్తోంది. మొదటి రెండు విడతల్లా లేదు ఈసారి. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అనో ఏమో.. వారాహికి బ్రేకులు వేసే ప్రయత్నం గట్టిగానే నడుస్తోంది. మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ జనసేనాని సభలతో విరుచుకుపడుతున్నారు. జగదాంబ సెంటర్లో సర్కారుపై మరోసారి రెచ్చిపోయారు. కట్ చేస్తే.. పవన్ కల్యాణ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ సెక్షన్ 30 ప్రకారం విశాఖ పోలీసులు నోటీసులు ఇవ్వడం కలకలం రేపుతోంది. విశాఖ తూర్పు ఏసీపీ నోటీసులు అందజేశారు. సభలో పవన్ కల్యాణ్ నిబంధనలు ఉల్లంఘించారని నోటీసులో ఆరోపించారు. ప్రజల్లో విభేదాలు రెచ్చగొట్టొద్దని, నిరాధార ఆరోపణలు చేయొద్దని, పోలీస్ ఆంక్షలు ఫాలో అవ్వాలని, షెడ్యూల్ ముందుగానే పోలీసులకు ఇవ్వాలని.. ఇలా పలు అంశాలను నోటీసులో ప్రస్తావించారు.
జనసేనాని కొత్త విషయాలేమీ మాట్లాడలేదు. గత వారాహి యాత్రల్లో చేసిన విమర్శలు, ఆరోపణలే ఈసారి కూడా చేశారు. కానీ, అప్పుడు నోటీసులు ఇవ్వలేదు. ఇప్పుడు మాత్రం పోలీసులు నోటీసులు చేతిలో పెట్టారు. అంటే..? ఇకపై పవన్ దూకుడుకు బ్రేకులు వేయాలనే సర్కారు డిసైడ్ అయిందా? జనసేనానిని స్వేచ్ఛగా వదిలేస్తే.. మరింత రెచ్చిపోతారనే భయమా? పవర్ఫుల్ లీడరైన పవన్ను ఇలాంటి నోటీసులతో అడ్డుకోగలరా? అనే చర్చ నడుస్తోంది.
ఇక, రుషికొండ పర్యటనపైనా పోలీస్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. పవన్ వాహనంతో పాటు మరో 7 వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. రుషికొండను రోడ్డు మీద నుంచే చూడాలని కండిషన్ పెట్టారు. మరి, పోలీసుల ఆంక్షలను జనసేనాని లెక్క చేస్తారా? మనల్ని ఎవడ్రా ఆపేదంటూ.. దూసుకెళతారా?