Lookout Notice on Vallabhaneni Vamsi: కృష్ణాజిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. వంశీ విదేశాలకు వెళ్లకుండా కొద్దిరోజుల క్రితమే లుక్ అవుట్ నోటీసులు జారీ చేయగా.. దానికంటే ముందే ఆయన విదేశాలకు చెక్కేసినట్లు సమాచారం. అయితే వంశీ ఇక్కడే ఉన్నాడా ? లేక విదేశాలకు వెళ్లిపోయాడా ? అన్నదానిపై పోలీసులు ఇంతవరకూ క్లారిటీ ఇవ్వలేదు. వంశీ గురించి తెలుసుకునేందుకు కూడా ఇమిగ్రేషన్ అధికారుల్ని సంప్రదించలేదని వార్తలొస్తున్నాయి.
కాగా.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికేసులో వల్లభనేని వంశీ నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో వంశీ సహా.. 70 మందిని నిందితులుగా చేర్చారు పోలీసులు. ఇప్పటి వరకూ 19 మందిని అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు. నిన్న ఏ21 మెండెం రాంబాబు, ఏ50 అమరేంద్రరెడ్డి, ఏ62 ఇమ్రాన్ లను అరెస్ట్ చేసినట్లు తెలిసింది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. రేపు వీరిని కోర్టులో హాజరు పరిచే అవకాశాలున్నాయి. వంశీ అమెరికాకు వెళ్లి ఉంటే.. పోలీసులను అక్కడికే పంపి.. అరెస్ట్ చేయించి తీసుకొస్తామంటున్నారు అధికారులు.