Nara Lokesh live today (political news in ap): టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బుధవారం తాడేపల్లి వెళుతున్న సమయంలో ఉండవల్లి వద్ద పోలీసులు కాన్వాయ్ ను కాసేపు ఆపేశారు. ఎన్నికల కోడ్ ను సాకు చూపించారు. కారులో తనిఖీలు చేశారు. పోలీసులకు లోకేశ్ సహకరించారు. ఎలాంటి ఎన్నికల ఉల్లంఘనలకు లోకేశ్ పాల్పడలేదని నిర్ధారించిన తర్వాత కాన్వాయ్ కు అనుమతించారు.
ఆ తర్వాత తాడేపల్లి చేరుకున్న లోకేశ్ అపర్ణ అపార్డుమెంట్ వాసులను కలిశారు. వారితో ముఖాముఖి నిర్వహించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ యువనేత విమర్శలు గుప్పించారు. జగన్ తన పాలనను ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభించారని ఆరోపించారు. ఈ ఐదేళ్లు ఏపీలో విధ్వంస పాలన జరిగిందని మండిపడ్డారు. ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని తెలిపారు.
దళిత యువకుడి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ అనంతబాబు దారుణాలను లోకేశ్ ప్రస్తావించారు. గంజాయిని రాష్ట్రమంతా సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి నాయకుడికి సీఎం ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఏపీలో గంజాయిని సమూలంగా నిర్మూలిస్తామని స్పష్టం చేశారు.
Also Read: కడప పార్లమెంటు పై కాంగ్రెస్ కన్ను.. అవినాష్ రెడ్డిపై షర్మిల పోటీ?
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గడికోటకు చెందిన టీడీపీ కార్యకర్త హత్యపై నారా లోకేశ్ ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. మునయ్యను వైసీపీ మూకలు దారుణంగా చంపేశాయమని ఆరోపించారు. టీడీపీలో చేరినప్పటి నుంచి మునయ్య బెదిరింపులు వచ్చాయన్నారు. చిలకలూరిపేట ప్రజాగళం సభకు వెళ్లడంతో మరింత కక్ష పెంచుకున్నారని పేర్కొన్నారు.
మునయ్యను గొడ్డలి నరికి దారుణంగా చంపేశారని లోకేశ్ మండిపడ్డారు. వైఎస్ వివేకానందరెడ్డిని గొడ్డలితో చంపేసి అధికారం దక్కించుకున్నారని.. ఇప్పుడు అధికారం పోతుందనే ఆందోళనతో టీడీపీ కార్యకర్తలపై గొడ్డలితో దాడులు చేస్తున్నారని విమర్శించారు. మునయ్య కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని లోకేశ్ భరోసా ఇచ్చారు. నిందితులకు శిక్ష పడేవరకు పోరాడతామని స్పష్టం చేశారు.
కుప్పం నియోజకవర్గం మాదిరిగానే మంగళగిరిని డెవలప్ చేస్తామని లోకేశ్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు.