Police Case on Ramana Deekshitulu : శ్రీవారి మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై తిరుమల 1టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. టీటీడీ ఈవో, శ్రీవారి ఆలయ కైంకర్యాలపై రమణదీక్షితులు ఆరోపణలు చేసినట్లు వచ్చిన ఓ ఆడియో వైరల్ అయింది. అదే ఆడియో ఆధారంగా.. టీటీడీ చీఫ్ ఇన్ఫర్మేషన్ అధికారి, దేవస్థానం సైబర్ సెక్యూరిటీ, సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ జీఎం ఎల్ మురళి సందీప్ రమణ దీక్షితులపై తిరుపతి వన్ టౌన్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆడియోలో ఉన్న వాయిస్ తనది కాదని ఇదివరకే రమణదీక్షితులు స్పందించారు. తాజాగా అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టాక.. ఆ ఆడియో రమణదీక్షితులదా కాదా అనేది తేలనుంది.
Read More : టీడీపీలో టికెట్ల పంచాయితీ.. రాజుకుంటున్న అసంతృప్తి సెగలు..
కాగా.. శనివారం శ్రీవారిని దర్శించుకున్న రమణ దీక్షితులతో ఆలయం వెలుపల మీడియా ప్రతినిధులు మాట్లాడారు. ఆలయంలో పూజా కైంకల్యాలపై అడగ్గా.. గతంలో మాదిరిగానే జరుగుతున్నాయన్నారు. ఆయనపై పోలీస్ కేసు గురించి ప్రశ్నించగా.. అందులో ఉన్నది తనగొంతు కాదని, అయినా ముద్దాయిలా చేయాలని చూస్తే.. తానేమీ చేయలేనని పేర్కొన్నారు. తిరుమల అహోబిలమఠం ప్రతిష్ఠను కూడా దిగజార్చేలా.. రమణ దీక్షితులు అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ఆయనపై ప్రభుత్వం, టిటిడి చర్యలు తీసుకోవాలని మఠం అధికారి పద్మనాభచారియర్ శనివారం టిటిడికి లేఖ రాశారు.