Mangalagiri AIIMS Inauguration(Andhra pradesh today news): మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ను ప్రధాని నరేంద్ర మోడీ నేడు రాజ్కోట్ నుంచి వర్చువల్గా జాతికి అంకితం చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం 16వందల 18 కోట్లతో 183.11 ఎకరాల్లో 960 పడకలతో ఎయిమ్స్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఇందులో 125 సీట్లతో కూడిన వైద్య కళాశాల ఉంది. విశాఖ పెదవాల్తేరు వద్ద స్టేట్ ఫుడ్ ల్యాబ్ క్యాంపస్లో 4.76 కోట్ల రూపాయలతో నిర్మించిన మైక్రోబయాలజీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్తో పాటు 2.07 కోట్ల రూపాయల విలువైన మరో 4 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లను ప్రధాని ప్రారంభిస్తారు.
Read More : టీడీపీలో టికెట్ల పంచాయితీ.. రాజుకుంటున్న అసంతృప్తి సెగలు..
అలాగే ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్లో భాగంగా 230 కోట్ల రూపాయల విలువైన 9 క్రిటికల్ కేర్ బ్లాక్లకు కూడా ప్రధాని వర్చువల్గా శంకుస్థాపన చేస్తారు. వీటిలో ప్రధానంగా వైఎస్సార్, నెల్లూరు, శ్రీకాకుళం, తిరుపతి, రాజమహేంద్రవరం, కర్నూలు, విజయనగరం జిల్లాల్లోని ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 23.75 కోట్ల రూపాయల చొప్పున, తెనాలి జిల్లా ఆస్పత్రిలో 44కోట్ల 50 లక్షల రూపాయలు, హిందూపూర్ జిల్లా ఆస్పత్రిలో 22 కోట్ల రూపాయలతో క్రిటికల్ కేర్ బ్లాకుల్ని నిర్మించనున్నారు.
ప్రధాని మంత్రి కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ తోపాటు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్ర మంత్రి డాక్టర్ భారతి ప్రవీన్ పవర్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని పాల్గొంటారు.