Modi: బీజేపీ మీద ఇటీవల కాలంలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈడీ, సీబీఐ, ఐటీలతో దాడులు చేయిస్తూ ప్రతిపక్షాలను భయపెడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. గవర్నర్ల వ్యవస్థతో బీజేపీ వ్యతిరేక ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నారనే వాదన ఉంది. ప్రధాని మోదీ సైతం ఈ విషయాన్ని పరోక్షంగా అంగీకరించారు. విపక్షాలన్నిటినీ ఈడీ ఏకం చేసిందంటూ పార్లమెంట్లో సెటైర్లు వేశారు. లేటెస్ట్ గా మరోసారి కాంగ్రెస్ పాలనపై అటాక్ కు దిగారు. తాము చేస్తున్నది తప్పోఒప్పో చెప్పకుండా.. కాంగ్రెస్ పాలన మరింత దారుణంగా ఉండేదంటూ గతాన్ని తవ్వి పోశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ప్రభుత్వ ప్రస్తావన తీసుకురావడం ఆసక్తికరం.
కాంగ్రెస్ పాలకులు ఆర్టికల్ 356ను దుర్వినియోగం చేశారంటూ ప్రధాని మోదీ మండిపడ్డారు. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో 50 సార్లకు పైగా ఆర్టికల్ 356తో ప్రభుత్వాలను పడగొట్టారని అన్నారు. ఎన్టీఆర్ చికిత్స కోసం అమెరికా వెళ్తే ఆయన ప్రభుత్వాన్ని పడగొట్టారు.. ఎంజీఆర్ వంటి దిగ్గజాల ప్రభుత్వాలను కాంగ్రెస్ అక్రమంగా పడగొట్టింది.. కాంగ్రెస్ పాలకులు 600లకు పైగా పథకాలకు గాంధీ, నెహ్రూ పేర్లు పెట్టారు.. గాంధీ పేరు ఉన్న నేతలు ఇంటిపేరులో నెహ్రూ పేరును ఎందుకు పెట్టుకోలేదు? అంటూ విమర్శల వర్షం కురిపించారు మోదీ.
మోదీ మాటల్లో వాస్తవం లేకపోలేదని గతాన్ని గుర్తు చేస్తున్నారు. అప్పట్లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. గవర్నర్ రామ్ లాల్ రూపంలో ఆయనకు అడుగడుగునా ఆటంకాలు ఎదురయ్యేవి. అనారోగ్యంతో అప్పటి సీఎం ఎన్టీఆర్ అమెరికాలో చికిత్స తీసుకునేందుకు వెళ్లగా.. నాదెండ్ల భాస్కర్ రావు రూపంలో ఆయన ప్రభుత్వాన్ని పడగొట్టారు. అందుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇదంతా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కనుసన్నల్లోనే జరిగిందని అంటారు. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ.. తాజాగా ప్రధాని మోదీ పార్లమెంట్లో ఆనాటి సంఘటనను ప్రస్తావించారని అంటున్నారు.