Temple In Pitapuram: ఆ నియోజకవర్గంకు ప్రాతినిధ్యం వహిస్తుందన్నది సాక్షాత్తు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అటువంటి నియోజకవర్గంలో గల ఓ ఆలయం.. అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా మారిందంటూ విమర్శలు వెలువెత్తుతున్నాయి. నిత్యం శునకాలు ఈ అలయంలోకి ప్రవేశించి, గందరగోళం చేస్తున్నాయని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకోవాలని భక్తులు కోరుతున్నారు.
పిఠాపురంలో దక్షిణ కాశీగా భావించే పవిత్ర పాదగయ ఆలయం వెలసి ఉంది. ఈ ఆలయానికి నిత్యం భక్తులు రాకపోకలు సాగిస్తుంటారు. ఆలయంలో వెలసిన శివలింగానికి పూజలు నిర్వహిస్తే.. కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అలాగే ఇక్కడ పవిత్ర కొలనులో స్నానం చేస్తే పాపాలు హరిస్తాయని చరిత్ర. అంతటి పవిత్రమైన ఆలయం నేడు అధ్వాన్నస్థితికి చేరుకుంది. ఆలయంలో ఎటు చూసినా.. చెత్త, చెదారం, మురికి కనిపిస్తుందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే పవిత్ర కొలనులో ఉన్న జలం రంగు కూడా పూర్తిగా మారిందని, భక్తులు పుణ్యస్నానం ఆచరించేందుకు కూడా వీలు లేకుండా ఉందని జై హనుమాన్ సేవా సమితి కాకినాడ జిల్లా అద్యక్షుడు సురేంద్ర దత్త తెలిపారు.
ఇంకా ఈ ఆలయ పరిస్థితి గురించి సురేంద్ర దత్త మాట్లాడుతూ.. కాకినాడ జిల్లాలో దక్షిణ కాశీగా పిలువబడే ఆలయంగా పవిత్ర పాదగయ ఆలయంకు ఘనచరిత్ర ఉందన్నారు. పూజల నిమిత్తం వచ్చిన భక్తులు పడుతున్న ఇబ్బందులు అన్నీ, ఇన్నీ కావన్నారు. ఆలయంలో ఎటు చూసినా మురికి ఉండడం ఏమిటని ప్రశ్నించారు. ఎంతో చారిత్రాత్మక చరిత్ర కలిగిన ఈ ఆలయం పట్ల అధికారులు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నట్లు విమర్శించారు. ఈ ఆలయంలో పూజలందుకునే స్వామి వారి పరిసరాల్లోకి నిత్యం శునకాలు ప్రవేశిస్తున్నాయని, అయినా కూడా అధికారులు పట్టించుకోని స్థితి ఉందన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
అధ్వానంగా దక్షిణ కాశీగా భావించే పవిత్ర పాదగయ ఆలయం..
ఎటు చూసినా.. చెత్త, చెదారం, మురికి
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ఠ
నిత్యం పూజలు చేసే శివలింగం, నందీశ్వరుడి విగ్రహాలను నాకుతూ, వాటిపై మూత్ర విసర్జన చేస్తున్న కుక్కలు… pic.twitter.com/sIZTYWDfRM
— BIG TV Breaking News (@bigtvtelugu) October 11, 2024
సాక్షాత్తు పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఆలయం అధ్వాన్నస్థితికి చేరుకోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే ప్రభుత్వం ఆలయాల పరిరక్షణకు అన్నీ చర్యలు తీసుకుంటున్న క్రమంలో.. ఈ ఆలయం పరిస్థితి ప్రభుత్వం దృష్టికి వెళ్లలేదా అంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తరపున సంబంధిత అధికారులకు పవన్ ఆదేశాలిచ్చి.. ఆలయం అభివృద్ది పథం వైపు నడిచేలా చూడాలని, అలాగే నిర్లక్ష్య వైఖరిలో ఉన్న సంబంధిత అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
దసరా శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్..
రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి పర్వదిన శుభాకాంక్షలను పవన్ తెలిపారు. విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ విజయదశమి ప్రజలందరికీ విజయం చేకూర్చాలని, తెలుగు రాష్ట్రాలపై శక్తి స్వరూపిణి దీవెనలు ఉండాలని ప్రార్థిస్తునన్నారు.