Interim Anticipatory bail Sanctioned by Court for Pinnelli in Another 3 Cases: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరో ఊరట లభించింది. పోలింగ్ బూత్ లో ఈవీఎంను పగలగొట్టిన కేసులో ఇప్పటికే ముందస్తు బెయిల్ పొందిన పిన్నెల్లికి.. మరో మూడు కేసుల్లోనూ కోర్టు ముందస్తు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తనపై ఉన్న మరో మూడు కేసుల్లోనూ బెయిల్ ఇవ్వాలని పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించగా.. దానిపై ధర్మాసనం విచారణ చేసింది. జూన్ 6వ తేదీ వరకూ ఆయనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోరాదని హైకోర్టు ఆదేశించింది. అలాగే కౌంటింగ్ లోనూ పాల్గొనేందుకు అనుమతినిచ్చింది.
ఇక పాల్వాయిగేట్ ఈవీఎం ధ్వంసం కేసులో ఉన్న బెయిల్ షరతులే ఇందులోనూ వర్తిస్తాయని న్యాయమూర్తి వెల్లడించారు. పాల్వాయిగేట్ ఘటనలో పిన్నెల్లిని అడ్డుకున్నందుకు తనపై దాడి జరిగిందని, హత్యాయత్నం కూడా జరిగిందని టీడీపీ ఏజెంట్ అయిన నంబూరి శేషగిరిరావు రెంటచింతల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందులో పిన్నెల్లితో పాటు మరో 15 మందిపై ఐపీసీ 307 (హత్యాయత్నం), ఇతర సెక్షన్ల కింద కేసు నమోదైంది.
అదేరోజున నాగశిరోమణి అనే మహిళ కూడా ఎమ్మెల్యేను అడ్డుకుని ప్రశ్నించగా.. ఆమెపై విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే. తనను ఎమ్మెల్యే దూషించారంటూ చెరుకూరి నాగశిరోమణని రెంటచింతల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో… ఐపీసీ సెక్షన్లు 506,509, ఆర్పీ చట్టం సెక్షన్ 131 కింద మరో కేసు నమోదైంది.
Also Read :ఈవీఎం డ్యామేజ్ కేసు.. పిన్నెల్లికి బిగ్ రిలీప్.. అప్పటివరకు మాత్రమే!
పోలింగ్ జరిగిన మర్నాడు కారంపూడిలో జరిగిన ఘటనలో పిన్నెల్లి, ఆయన తమ్ముడిపై ఇంకొక కేసు నమోదైంది. దాడులకు పాల్పడుతున్న పిన్నెల్లిని అడ్డుకోబోయిన సీఐ టీపీ నారాయణస్వామిపై దాడిచేసి, గాయపరిచారు. దీనిపై సీఐ ఫిర్యాదు చేయగా.. పిన్నెల్లి, ఆయన సోదరుడు, అనుచరులపై 307, ఇతర సెక్షన్ల కింద కారంపూడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈవీఎం ధ్వంసం, టీడీపీ ఏజెంట్ పై దాడి, మహిళపై దూషణ, సీఐ పై దాడి.. మొత్తం నాలుగు కేసుల్లోనూ పిన్నెల్లికి ముందస్తు, మధ్యంతర బెయిల్స్ రావడంతో కాస్త ఊరట దక్కింది.