Volunteer Murder Case :
⦿ దుర్గా ప్రసాద్ హత్య పక్కా ప్లాన్ ప్రకారమే
⦿ ధర్మేష్ తో కలిసి స్కెచ్, నలుగురితో అమలు
⦿ బోట్ లో తీసుకెళ్లి గోదావరి మధ్యలో చంపిన వైనం
⦿ సంచలనం రేపుతున్న శ్రీకాంత్ రిమాండ్ రిపోర్టు
⦿ మీడియాకు వివరాలు వెల్లడించిన డీఎస్పీ
అంబేద్కర్ కోనసీమ జిల్లా, స్వేచ్ఛ : కోనసీమ జిల్లాకు చెందిన దళిత యువకుడు, వలంటీర్ జనుపల్లి దుర్గా ప్రసాద్ హత్య కేసులో పినిపె శ్రీకాంత్ రిమాండ్ రిపోర్టు బయటికి వచ్చింది. ఇందులోని ఒక్కో విషయం సంచలనం రేపుతోంది. అంతా ప్లాన్ ప్రకారమే చేశారని పోలీసులు చెబుతున్నారు. శ్రీకాంత్ భార్యపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకే దుర్గా ప్రసాద్ ను హత్య చేయాలని స్కెచ్ వేసినట్లు పోలీసులు తేల్చారు. ఈ ఘటనపై కొత్తపేట డీఎస్పీ గోవిందరావు ఆసక్తికర విషయాలు తెలిపారు. ‘అక్టోబర్ 18న వడ్డే ధర్మేష్ అనే ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకొని విచారించాం. విచారిస్తే అతను ఈ నేరాన్ని ఒప్పుకుంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. కొత్తపేట వీఆర్ఓ దగ్గరకు తీసుకెళ్లి రికార్డ్ చేశాం. దుర్గాప్రసాద్ వలంటీర్తో పాటు నాటి మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్తో సన్నిహితంగా ఉండేవాడు. సోషల్ మీడియా కన్వీనర్ వడ్డే ధర్మేష్, శ్రీకాంత్ భార్యను ఉద్దేశించి దుర్గాప్రసాద్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. దీంతో వాలంటీర్ను చంపడానికి ధర్మేష్ను శ్రీకాంత్ ఆదేశించాడు. ఆ తర్వాత ప్లాన్ ప్రకారమే హత్య చేశారు. ఈ హత్యకు ప్రధాన కారణం పొలిటికల్ ప్రమేయం కాదు. మనస్పర్ధలు, కొన్ని వ్యక్తిగత కారణాలే అని భావిస్తున్నాం. ఈ హత్య కేసు ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది’ అని డీఎస్పీ వెల్లడించారు.
ALSO READ : హైకోర్టులో ఎంపీ అవినాష్కు షాక్
చంపేసి.. వదిలేసి
‘ 2022 జూన్ 5 న దుర్గాప్రసాద్ మర్డర్ కు ప్లాన్ చేశారు. సన్నిహితుడు ధర్మేష్తో కలిసి హత్యకు శ్రీకాంత్ ప్లాన్ చేశాడు. నలుగురితో హత్య చేయాలని ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. జూన్ 6న దుర్గాప్రసాద్ను కోటిపల్లి రేవుకు ధర్మేష్ తీసుకెళ్లాడు. అక్కడున్న నలుగురికి అప్పగించాడు. ఈ నలుగురూ దుర్గాప్రసాద్ ను బోట్ లో గోదావరి మధ్యలోకి తీసుకెళ్లారు. నలుగురు కలసి దుర్గా ప్రసాద్ మెడకు తాడు బిగించి హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని వదిలేసి నిందితులు పరారయ్యారు. హత్య జరిగిన రోజే అయినవల్లి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు అయ్యింది. జూన్ 10న గుర్తు తెలియని మృతదేహం దొరికింది. పోస్టుమార్టం రిపోర్టులో మెడ ఎముకలు రెండు వైపులా విరిగాయి. డెత్ సర్టిఫికెట్ ప్రకారం మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చాం’ అని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కాగా మంగళవారం అర్ధరాత్రి న్యాయమూర్తి ఎదుట శ్రీకాంత్ను హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు శ్రీకాంత్ ను తరలించారు.