Photographer Murder in Vizag(AP news today telugu): ఆ యువకుడు బతుకు తెరువు కోసం ఫోటో గ్రాఫర్ వృత్తిని ఎంచుకున్నాడు. వివాహ వేడుకలు ఫోటోలు, వీడియోలు తీస్తుండేవాడు. దూర ప్రాంతాలకు వెళ్లి కూడా పెళ్లి వేడుకలకు ఫోటోలు, వీడియోలు తీసేవాడు. ఈ క్రమంలోనే ఆన్ లైన్ ద్వారా ఓ ఈవెంట్ బుక్ అయ్యింది. తీరా మ్యారేజ్ షూటింగ్ కు వెళ్లిన అతడు కనిపించకుండా పోయాడు. అసలేం జరిగిందంటే..?
విశాఖపట్నం జిల్లా పీఎం పాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోతిన సాయి కుమార్ అనే 23 ఏళ్ల యువకుడు మధురవాడ బక్కన్నపాలెంకు చెందినవాడు. ఫిబ్రవరి 26న అతడిని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లా రావులపాలెంకు చెందిన ఇద్దరు యువకులు ఫోటో షూట్ కోసం సంప్రదించారు. 10 రోజులపాటు ఫోటో షూట్ చేయాలని కోరారు. మంచి ఈవెంట్ దొరికిందన్న ఉత్సాహంతో సాయికుమార్ కెమెరా సామాగ్రితో రావులపాలెంకు బయలుదేరాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లాడు.
విశాఖపట్నంలో పోతిన సాయికుమార్ రైలు ఎక్కాడు. రాజమండ్రిలో దిగాడు. అక్కడికి చేరుకోగానే ఫోటో షూట్ కోసం సంప్రదించిన ఇద్దరు యువకులు వచ్చారు. సాయికుమార్ ను కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఆ తర్వాత నుంచి అతని ఆచూకీ లభ్యంకాలేదు.
Read More: కంటకాపల్లి రైలు ప్రమాదం.. ఫోన్లో క్రికెట్ చూస్తూ నడపడంవల్లేనన్న మంత్రి
సాయికుమార్ తో మాట్లాడేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించారు. మూడు రోజులైనా అతడి నుంచి స్పందన రాలేదు. ఏమైందో ఏమో అని కంగారు పడ్డారు. పోలీసులను ఆశ్రయించారు. విశాఖపట్నం పీఎం పాలెం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సాయికుమార్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.
సాయికుమార్ కాల్ డేటాను పోలీసులు సేకరించారు. అతడి ఆచూకీ లభ్యంకాకపోవడానికి ముందు ఎవరెవరితో మాట్లాడాడో వివరాలు సేకరించారు. ఈ క్రమంలోనే షణ్ముఖ తేజ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో సాయికుమార్ హత్యకు గురయ్యాడని తేల్చారు. మూలస్థానం గ్రామానికి చెందిన మరో వ్యక్తితో కలిసి మర్డర్ చేసినట్లు షణ్ముక తేజ అంగీకరించాడని పోలీసులు చెప్పారు. డెడ్ బాడీని కడియపులంకలో పూడ్డి పెట్టినట్లు నిందితుడు తెలిపాడన్నారు. దీంతో మృతదేహాన్ని వెలికి తీశారు. ఇద్దరు నిందితులు అరెస్ట్ చేశామని విశాఖ సీపీ రవిశంకర్ వెల్లడించారు.
సాయికుమార్ వద్ద ఉన్న కెమెరా విలువ రూ. 15 లక్షలు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు యువకులు ఫోటో షూట్ అని నమ్మించి అతడిని విశాఖ నుంచి రప్పించారు. పథకం ప్రకారం హత్య చేశారు. ఆ కెమెరాతో పరారయ్యారు. కొడుకు మృతితో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.