Satires on YSRCP’s Distribution of essential commodities: దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు ప్రస్తుతం వైసీపీ తీరు ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఇందుకు కారణం జగన్ ప్రకటించిన రూ. కోటి విరాళమే. ఇన్ని రోజులు ఆయన ప్రకటించిన సాయం వరద బాధితులకు అందలేదు. దీనిపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో వైసీపీ నేతలు అప్రమత్తమయ్యారు. వరద బాధితులకు బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో నిత్యావసర సరకుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. చేసేది మంచి పనే అయినా వెంటనే ఆ సాయం అంది ఉంటే వైసీపీకి మంచి పేరు వచ్చేది. కానీ, వరదలు వచ్చి వెళ్లి దాదాపు 20 రోజులు అవుతున్న తరువాత వైసీపీ సాయానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో విమర్శలు వస్తున్నాయి.
దీనిపై ప్రముఖ వైసీపీ నేత దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆదేశాలతో వరద బాధితులకు నిత్యావసర సరకుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. వరదల సమయంలో ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టడం విషయంలో, ఇటు వారిని ఆదుకునే విషయంలో పూర్తిగా విఫలమైందన్నారు. వరదలు వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా కూడా వారిని ప్రభుత్వం ఆదుకోలేకపోతుందన్నారు. ఈ క్రమంలో వైసీపీ ముందుకొచ్చి వరద బాధితులను ఆదుకుంటుందని చెప్పారు. అందులో భాగంగా జగన్ ప్రకటించిన రూ. కోటి విరాళానికి అనుగుణంగా నిత్యావసర సరకులు పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. కూటమి ప్రభుత్వంలా తాము షో రాజకీయాలు చేయబోమ్నారు. తమదంతా రియాలిటీ రాజకీయాలన్నారు. గెలిచినా, ఓడినా వైసీపీ ప్రజల కోసమే పనిచేస్తుందని చెప్పారు.
Also Read: మందుబాబులకు భారీ శుభవార్త.. దసరా కానుకగా తక్కువ ధరకే.. రేట్లు తెలిస్తే ఎగిరి గంతేస్తారు!
ఇప్పటికే రెండు విడతల్లో పార్టీ కేడర్ సాయం అందించగా, మూడో విడతగా రేపటి నుంచి అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. నిత్యావసర సరకులతో కూడిన మొత్తం 50 వేల స్పెషల్ ప్యాకెట్లను వరద ప్రాంతాల్లో పంపిణీ చేస్తామన్నారు. ఒక్కో ప్యాకెట్లలో కందిపప్పు, బెల్లం, వంటనూనె, టెట్రా ప్యాక్ మిల్క్, ఉప్మారవ్వ, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, బిస్కెట్ ప్యాకెట్లు తదితర వస్తువులు ఉన్నట్లు చెప్పారు.
ఇదిలా ఉంటే.. ఏపీలో ఇటీవలే వరదలు ముంచెత్తాయి. దీంతో పలు ప్రాంతాల్లో ప్రజలు అల్లాడిపోయారు. వరద నీరు పూర్తిగా కమ్మేసింది. బెజవాడలో అయితే పరిస్థితిని వర్ణించలేనంతగా వరదలు ముంచెత్తాయి. అయితే, ఎప్పుడు వర్షాలు వచ్చినా కూడా బెజవాడలో ఇదే పరిస్థితి ఎదురవుతుంటుంది. అయితే, ఈసారి వచ్చిన భారీ వర్షాల వల్ల బుడమేరు పొంగిపొర్లింది. బడమేరుకు మూడు గండ్లు పడడంతో వరదలు గతంలో ఎప్పుడూలేనంతగా బెజవాడను ముంచెత్తింది. ఆ సమయంలో బెజవాడలో ఎటు చూసినా వరద నీళ్లే కనిపించాయి. విజయవాడ మొత్తం వరద నీటిలో తేలియాడింది. ఈ భారీ వర్షాలు, వరదల వల్ల పలువురు మృత్యవాతపడ్డారు. ఎడతెరిపిలేని వర్షం, ముంచెత్తుతున్న వరదలు.. ఈ క్రమంలో బెజవాడవాసులు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని భయంభయంగా గడిపారు ఆ నాలుగురోజులు. సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. తిండి తికానా లేదు. ఎవరు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి.. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.
Also Read: పెద్ద ప్లానింగే.. అందుకేనా శ్యామలకు ఆ పదవి, ఉచ్చులో చిక్కుకుంటారు జాగ్రత్త!
ఈ క్రమంలో ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఎప్పటికప్పుడు అధికారులను అలర్ట్ చేసింది. వర్షాలు కురుస్తున్న తరుణంలో అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. ఎక్కడైతే వరద భారీగా ఉందో అక్కడ ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టింది. బెజవాడలో సీఎం చంద్రబాబు రంగంలోకి దిగి సహాయక చర్యల ఏర్పాట్లును పరిశీలించారు. ఇటు వరద బాధిత ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటించారు.
వరద బాధితులకు మొదటగా వారిని రిహాబిలిటేషన్ సెంటర్లకు తరలించారు. ఆ తరువాత వారికి అవసరమైన ఆహారం, పాలు, బిస్కెట్లు, నీళ్లు అందించారు. పలు చోట్ల సహాయక చర్యలకు ఆటంకం కలిగినా అక్కడ పలువురు అధికారులు ప్రాణాలకు తెగించి మరి సహాయక చర్యలు చేపట్టి వరద బాధితులను ఆదుకున్నారు. హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా వారికి ఆహారం, పాల ప్యాకెట్లు, నీళ్లు, బిస్కెట్లు అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులు, సిబ్బింది అక్కడికి పెద్ద ఎత్తున చేరుకుని ఆ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఆ తరువాత వరద నీరు తగ్గుతున్న ప్రాంతాల్లో కూడా చెత్త తొలగింపు కార్యక్రమాలు, వరద ముంచెత్తిన ఇళ్లను క్లీన్ చేశారు. అందుకోసం ప్రత్యేకంగా ఫైరింజన్స్, యంత్రాలను తెప్పించారు. రోడ్లను, ఇళ్లను క్లీన్ చేశారు. ఇటు బుడమేరు వద్ద ఆ మూడు గండ్లను పూడ్చివేశారు.
Also Read: ఒక్క ‘సాక్షి’కే రూ.300 కోట్లా? అంటే ఐదేళ్లలో..? అయ్య బాబోయ్, జగన్ మామూలోడు కాదు!
ఆ తరువాత సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు మళ్లీ పునరావృతం కాకుండా ఇకముందు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
ఇటు జగన్, పలువురు వైసీపీ నేతలు కూడా బెజవాడ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసా ఇచ్చారు. సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టడం విషయంలోనూ, అటు వర్షాల నేపథ్యంలో ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ ఆయన మండిపడిన విషయం తెలిసిందే.