MLC Shaik Sabji: పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం చెందారు. ఉండి మండలం చెరుకువాడ వద్ద 2 కార్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ అక్కడికక్కడే మరణించారు. అంగన్ వాడీ కార్యకర్తల సమ్మెలో పాల్గొని ఏలూరు నుంచి భీమవరం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ఎమ్మెల్సీ ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీ కొట్టింది. ఎమ్మెల్సీ ప్రయాణిస్తున్న కారు ముందు భాగమంతా నుజ్జు నుజ్జవ్వగా.. కారు లోపలి సీట్లు విరిగిపోయాయి. శుక్రవారం ఉదయం ఏలూరులో అంగన్ వాడీ కార్యకర్తల సమ్మెలో ఆయన పాల్గొన్నారు. అనంతరం భీమవరం వెళ్తుండగా.. ఆకివీడు దాటిన తర్వాత ఆయన కారు ప్రమాదానికి గురైంది. ఎమ్మెల్సీ మృతి చెందగా.. గన్ మెన్ కు తీవ్రగాయాలయ్యాయి. ఆయన మృతదేహాన్ని భీమవరం ఆస్పత్రికి తరలించారు.
కాగా.. మంత్రివర్గ సమావేశం జరుగుతుండగా ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మరణవార్త విన్న సీఎం జగన్.. కేబినెట్ సమావేశంలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాబ్జీ మృతి పట్ల కేబినెట్ సంతాపం తెలిపింది. కేబినెట్ సమావేశంలో 2 నిమిషాల పాటు మౌనం పాటించారు.
అలాగే ఎమ్మెల్సీ మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ నేత నారా లోకేష్ దిగ్భ్రాంతి చెందారు. చివరి క్షణంలో కూడా ఆయన ప్రజాసేవలో పాల్గొన్నారని పేర్కొన్నారు. సాబ్జీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శాసన మండలిలో వినిపించే ప్రజల గొంతుక మూగబోయిందని లోకేష్ అన్నారు. టీచర్ల హక్కుల పోరాటయోధుడైన సాబ్జీకి నివాళులర్పిస్తూ.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
.
.