Anganwadi Protest : మూడు గంటల్లోగా విధులకు హాజరైన వారి ఉద్యోగం ఉంటుంది. లేనివారిది ఊస్టే. ఇది ఏపీలో సమ్మెలో ఉన్న అంగన్వాడీల పరిస్థితి. ప్రభుత్వం విధించిన డెడ్ లైన్ లోగా డ్యూటీలకు హాజరుకాని వారి స్థానంలో కొత్తవారిని తీసుకునేందుకు జగన్ సర్కార్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులోభాగంగా ఈ నెల 25న ఏపీలో అంగన్వాడీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. 26వ తేదీ నుంచి సచివాలయాల ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తులు తీసుకోనుంది.
అంగన్వాడీల పోరాటంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు.సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లపై ప్రభుత్వం అనుసరిస్తోన్న వైఖరి ప్రజాస్వామ్యయుతంగా లేదని విమర్శించారు. చర్చలు జరపకుండా.. విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు ఇవ్వడాన్నితప్పుపట్టారు. ఆందోళనకారులపై పోలీసు చర్యలు చేపట్టడం సరైన పద్ధతి కాదన్నారు. సీఎం జగన్కు కోటి సంతకాలతో వినతి పత్రం ఇచ్చేందుకు ‘చలో విజయవాడ’ కార్యక్రమం చేపడితే పోలీసులు అర్ధరాత్రి వేళ అంగన్ వాడీలను ఈడ్చి వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు.
అంగన్వాడీల అరెస్టుతో వారి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయన్నారు. ఈ న్యూస్ కవరేజ్ ఇస్తున్న మీడియా సిబ్బందిపైనా విజయవాడలో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని పవన్ విమర్శించారు. సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో అంగన్ వాడీలకు హామీలిచ్చారని గుర్తు చేశారు. పాదయాత్ర సమయంలో జగన్.. పొరుగు రాష్ట్రాల కంటే ఎక్కువ జీతం ఇస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ఆ హామీనే అమలు చేయాలని అంగన్ వాడీలు కోరుతున్నారని అన్నారు. తక్కువ జీతాలకు పని చేస్తున్న అంగన్ వాడీల విషయంలో సానుకూల దృక్పథంతో ఆలోచించాలని జనసేనాని సూచించారు.