Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసం ఈ సమావేశానికి వేదికైంది. జనసేనానికి చంద్రబాబు స్వాగతం పలికి ఇంట్లోకి ఆహ్వానించారు. ఏపీలోని తాజా రాజకీయ పరిణామాలు , ఇటీవల కుప్పంలో జరిగిన ఘటనలపైనా ఇరువురు నేతలు చర్చించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక బలోపేతానికి ఐక్య కార్యాచరణ రూపొందించే అంశంపై చర్చించారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్-1పైనా తాజా భేటీలో చర్చించారు. దాదాపు 2 గంటలపాటు చంద్రబాబు, పవన్ కల్యాణ్ రాష్ట్రంలో తాజాా రాజకీయ పరిణామాలపై చర్చించారు.
ఏపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఉమ్మడి పోరాటం చేయాలని ఇప్పటికే చంద్రబాబు, పవన్ నిర్ణయించారు. కొద్దినెలల క్రితం విజయవాడలోని ఓ హోటల్లో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన మధ్య పొత్తు ఉంటుందనే ప్రచారం నేపథ్యంలో చంద్రబాబు, పవన్ తాజా భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.
అనంతపురం జిల్లా టీడీపీ సీనియర్ నేత , మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంటే అనంతపురం జిల్లాలో పవన్ ఎక్కడి నుంచి పోటీ చేసినా తాను గెలిపిస్తానని భరోసా ఇచ్చారు. జనసేనాని గెలుపు బాధ్యతను తాను తీసుకుంటానని స్పష్టం చేశారు. పవన్, చంద్రబాబు భేటీ నేపథ్యంలో…ప్రభాకర్ చౌదరి చేసిన ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.