Janasena party latest news today(Breaking news in Andhra Pradesh): జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తిరుపతి పర్యటన ఉత్కంఠ రేపుతోంది. ఎస్పీని జనసేనాని కలవనున్నారు. శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ పై ఫిర్యాదు చేయనున్నారు. సీఐ వ్యవహార శైలిని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. దురుసుగా ప్రవర్తించిన ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. ఈ విషయంపై పవన్ కల్యాణ్ ఎస్పీకి వినతిపత్రం అందించనున్నారు.
ఇప్పటికే తిరుపతి చేరుకున్న పవన్.. రేణిగుంట విమానాశ్రయం నుంచి ఎస్పీ కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరారు. శ్రీకాళహస్తి సీఐపై ఎస్పీకి ఆయన ఫిర్యాదు చేయనున్నారు. ఇటీవల చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆ సమయంలో జనసేన కార్యకర్త సాయిని సీఐ అంజూ యాదవ్ చెంపలపై కొట్టారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ ఘటనపై పవన్ కల్యాణ్ ఇప్పటికే స్పందించారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న వ్యక్తిపై దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు. జనసైనికుడు సాయికి న్యాయం జరిగే వరకు పోరాడతానని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆ సీఐపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఎస్పీ ఆఫీస్ కు భారీగా ర్యాలీగా వెళ్లేందుకు జనసేన ప్లాన్ చేసింది. అనుమతి లేకుండా ర్యాలీలు చేయొద్దని పోలీసులు అంటున్నారు. దీంతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది.
జనసేన కార్యకర్తపై సీఐ అంజూ యాదవ్ చేయి చేసుకున్న తర్వాత పోలీసు ఉన్నతాధికారులు వెంటనే రియాక్ట్ అయ్యారు. ఈ ఘటనపై నివేదికను ఉన్నతాధికారులు డీఐజీకి పంపారు. అలాగే అంజూ యాదవ్కు చార్జ్ మెమో జారీ చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి విచారణ జరిపి డీజీపీకి నివేదిక అందించారు.
అటు జనసేన కార్యకర్త సాయిపై దాడి ఘటనను సుమోటోగా స్వీకరించింది మానవ హక్కుల కమిషన్. సీఐ అంజుయాదవ్, స్టేషన్ ఆఫీసర్, తిరుపతి ఎస్పీ, డీఎస్పీ, అనంతపురం డీఐజీ, తిరుపతి కలెక్టర్, డీజీపీ, హోం సెక్రటరీ, చీఫ్ సెక్రటరీలకు నోటీసులు జారీ చేసింది. విచారణ జరిపి ఈ నెల 27లోగా నివేదిక సమర్పించాలని HRC ఆదేశాలు జారీ చేసింది.