Pawan Kalyan Will Contest from Bhimavaram: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భీమవరం టూర్ కు సిద్ధమయ్యారు. మంగళవారం నుంచి ఈ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. వాస్తవానికి ఫిబ్రవరి 14నే ఈ పర్యటన చేపట్టాల్సి ఉండగా.. హెలీకాఫ్టర్ ల్యాండింగ్ కు అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో అప్పుడు వాయిదా పడింది. ఇప్పుడు అనుమతులు లభించడంతో భీమవరం పర్యటనకు జనసేనాని సిద్ధమయ్యారు.
మరోవైపు పవన్ కల్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు అనేక నియోజకవర్గాల పేర్లు వినిపించాయి. తిరుపతి, కాకినాడ, గాజువాక, భీమవరం, భీమిలి నియోజకవర్గాల పేర్లు పవన్ పోటీ చేస్తారనే జాబితాలో చేరిపోయాయి. తాజాగా అయితే పవన్ భీమవరం నుంచే పోటీ చేస్తారని ఆ పార్టీలోనే టాక్ బలంగా నడుస్తోంది.
2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ భీమవరం, గాజువాక నుంచి బరిలోకి దిగారు. పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ ఓటమిపాలయ్యారు. ఇప్పుడు ఎన్నికలకు రెండు నెలలే సమయం ఉన్నా ఇప్పటికీ పవన్ పోటీ చేసే సెగ్మెంట్ పై అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. పవన్ కల్యాణ్ క్లారిటీ ఇవ్వలేదు.
Read More: “ఫ్యాన్ రెక్కలు విరగ్గొట్టాలి.. చెత్తబుట్టలో పడేయాలి..”
కొన్నిరోజుల క్రితం జనసేనాని కాకినాడలో మకాం వేశారు. అక్కడ రెండు మూడు రోజులు ఉన్నారు. ఆ సమయంలో స్థానిక నేతలతో సమీక్షలు నిర్వహించారు. ఆ సమయంలో కాకినాడ నుంచి పవన్ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఇప్పుడు భీమవరం పర్యటన వేళ అలాంటి వార్తలే వస్తున్నాయి. కానీ జనసేనాని మాత్రం క్లారిటీ ఇవ్వటం లేదు.
ఒక చోట ఎమ్మెల్యేగా మరో స్థానం ఎంపీగా పవన్ కల్యాణ్ పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. బీజేపీ పెద్దలు జనసేనానికి ఈ సూచన చేశారని వార్తలు వచ్చాయి. కాకినాడ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉంటారనే చర్చ నడిచింది. తాజాగా భీమవరంలో పవన్ కు ఇల్లు కోసం జనసేన కార్యకర్తలు వెతుకుతున్నారని తెలుస్తోంది. అందుకే పవన్ కల్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తారనే వార్తలకు బలం చేకూరుతోంది.
గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పై వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ విజయం సాధించారు. ఇప్పుడు ఆయనే మళ్లీ బరిలోకి దిగనున్నారు. పవన్ కళ్యాణ్ నాన్ లోకల్ అంటూ స్థానిక ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ అక్కడే మకాం వేసేందుకు ఇల్లు చూస్తున్నారని తెలుస్తోంది. మరి భీమవరం నుంచి పవన్ మళ్లీ పోటీ చేయడం ఖాయమేనా?