Pawan Kalyan : వైసీపీ ప్రభుత్వంపై జనసేనాని మరోసారి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు పవన్. అనంతరం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ను మరోసారి విడగొడతామంటే తోలుతీస్తానని హెచ్చరించారు. వేర్పాటు వాదంపై ఎవరైనా మాట్లాడితే తనలో తీవ్రవాదిని చూస్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ విధానాలపై ఎవరికీ సమాధానం చెప్పక్కర్లేదని వైసీపీ నేతలు అనుకుంటున్నారని.. వాళ్ల మెడలు వంచి జవాబు చెప్పిస్తానని జనసేనాని స్పష్టం చేశారు.
ఉత్తరాంధ్ర, రాయలసీమను ప్రత్యేక రాష్ట్రాలు చేయాలని ఇటీవల కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై పవన్ నిప్పులు చెరిగారు. ఏమయ్యా ధర్మాన ప్రత్యేక ఉత్తరాంధ్ర కావాలా? అని ప్రశ్నించారు. ప్రత్యేక రాయలసీమ కావాలంటన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిపై ప్రశ్నలు సంధించారు. రాష్ట్ర ముఖ్యమంత్రుల్లో చాలామంది రాయలసీమ వారే కదా.. మరి ఈ ప్రాంతంలో ఎందుకు అభివృద్ధి జరగలేదని నిలదీశారు. అక్కడ నుంచి వలసలు ఎందుకు ఆపలేకపోయారు? ప్రశ్నించారు.
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేస్తూ పవన్ విమర్శలు గుప్పించారు. ఈసారి ప్రధానిని కలిస్తే వైసీపీ నేతలపై ఫిర్యాదు చేస్తానని తెలిపారు. అమలాపురంలో మంత్రి ఇల్లు తగులబెట్టించుకున్నారని ఆరోపించారు. వాళ్లే నిప్పు పెట్టించుకున్నారు కాబట్టే పరామర్శకు ముఖ్యమంత్రి జగన్ వెళ్లలేదని మండిపడ్డారు. వివేకానంద రెడ్డి హత్య కేసును సీబీఐకు ఇవ్వమనడమేంటి? అని పవన్ ప్రశ్నించారు.
వైజాగ్ స్టీల్ప్లాంట్ కోసం తెలంగాణలోని జగిత్యాలలో సాయిరెడ్డి , గుంటూరులో హబీబుల్లా మస్తాన్ మరణించారని పవన్ తెలిపారు. ఆ సంగతి మీకు తెలుసా? అని వైసీపీ నేతలను ప్రశ్నించారు. మీ స్వార్థం కోసం ఇష్టారాజ్యంగా స్టేట్మెంట్లు ఇవ్వొద్దని అధికార పార్టీ నేతలపై మండిపడ్డారు. రాష్ట్రాన్ని, ప్రజలను విడగొట్టింది చాలు.. ఇక ఆపేయండని పవన్ ఘాటుగా వ్యాఖ్యానించారు. తన వారాహి వాహనాన్ని అడ్డుకోవడానికి వైసీపీ నేతలు చూస్తున్నారని… ఆపండి చూద్దాం ఏ జరుగుతుందో అని జనసేనాని సవాల్ చేశారు.