Pawan Kalyan : ఉభయగోదావరి జిల్లాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర ముగింపు దశకు చేరుకుంది. నేడు భీమవరంలో జనసేనాని వారాహి యాత్ర చేపట్టనున్నారు. ఇక్కడ నిర్వహించే సభలో పవన్ ప్రసంగించనున్నారు. అయితే ఈ సభలో జనసేనాని స్పీచ్ పై సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇటీవల జనసేనానికి సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు. పవన్ మాట్లాడే విధానాన్ని తప్పుపట్టారు. లారీ లాంటి వాహనం ఎక్కి బూతులు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆ తర్వాత జగన్ కు పవన్ కూడా తిరిగి కౌంటర్ ఇచ్చారు. సీఎంకు వారాహి, వరాహి మధ్య తేడా తెలియదని సెటైర్లు వేశారు. అంతేకాదు ఇకపై తాను జగన్ శైలిలో మాట్లాడతానని చురకలు అంటించారు. ఈ నేపథ్యంలో భీమవరం సభలో పవన్ స్పీచ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
గురువారం భీమవరంలో శెట్టిబలిజ నేతలతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. బీసీలకు రాజ్యాధికారం రావాలని ఆకాంక్షించారు. శెట్టిబలిజలను గౌడ కులస్తులుగా గుర్తించాలన్నారు. ఇతరులతో పోల్చితే బీసీలలో ఐక్యత తక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు. బీసీలు బలపడితేనే రాజ్యాధికారం వస్తుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.