అధికారం కోసం ఓట్లు అడగను.. మార్పు కోసం ఓట్లు అడుగుతానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖపట్నం ఎంవీపీ కాలనీ ఏఎస్ రాజా గ్రౌండ్స్లో నిర్వహించిన బహిరంగ సభలో జనసేనాని పాల్గొన్నారు. ఈ సమావేశంలో నాదెండ్ల మనోహర్, నాగబాబు, జిల్లా పార్టీ నేతలు పాల్గొన్నారు.
పదవుల కోసం తానెప్పుడూ ఆలోచించలేదని పవన్ స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఉపాధి కోసం వలసలు వెళ్తున్నారని తెలిపారు. ఉత్తరాంధ్రలో వలసలు ఆగాలన్నారు. ఇక్కడే ఉపాధి అవకాశాలుండాలని వివరించారు. కష్టం వస్తే ఆదుకుంటామని చెప్పేందుకే జాలర్లను ఆదుకున్నానని చెప్పారు.
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశంపై పవన్ స్పందించారు. విశాఖ ఉక్కు అనేది ఆంధ్రులను ఏకతాటిపై ఉంచిన నినాదమని పేర్కొన్నారు. అన్ని జిల్లాలను ఏకం చేసిన నినాదమన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమపై తన అభిప్రాయాన్ని అమిత్ షా గౌరవించారని వెల్లడించారు.
విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ కాకుండా ప్రయత్నం చేయగలిగామన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశం భావోద్వేగంతో కూడినదన్నారు. ఇదే విషయాన్ని కేంద్ర పెద్దలకు చెప్పానన్నారు. ఎప్పుడూ ఎన్నికల కోసం ఆలోచించలేదని పవన్ వివరించారు. ఒక తరం కోసం ఆలోచించానని చెప్పారు.