Pawan Kalyan varahi yatra updates(Latest political news in Andhra Pradesh) : ఉభయగోదావరి జిల్లాల్లో వారాహి యాత్ర చేపట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో జనసేనాని పర్యటన కొనసాగుతోంది. ఉపవాస దీక్షలో ఉండటం వల్ల నీరస పడ్డారు. దీంతో స్వల్ప అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది. దీంతో ఆయన పెదఅమిరంలోనే ఉండిపోయారు. అక్కడ నిర్మలాదేవి ఫంక్షన్ హాల్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు.
పవన్ అనారోగ్యం కారణంతో ఉదయం 11 గంటలకు భీమవరం నియోజకవర్గ నేతలతో జరగాల్సిన సమావేశం వాయిదా పడింది.ఇతర పార్టీలకు చెందిన నేతలు పవన్ సమక్షంలో జనసేనలో కండువాకప్పుకోనున్నారు. పవన్ కోలుకుంటే సాయంత్రం నుంచి యథావిథిగా కార్యక్రమాలు కొనసాగుతాయని తెలుస్తోంది. ఈ రోజు భీమవరంలో పవన్ వారాహియాత్ర ముగియనుంది. అక్కడ నిర్వహించే బహిరంగ సభలో జనసేనాని ప్రశంగించాల్సి ఉంది. పవన్ అనారోగ్య వార్త తెలియగానే ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. త్వరగా కోలుకుని ముగింపు సభలో పాల్గొనాలని కోరుకుంటున్నారు.
కాకినాడ జిల్లాలోని అన్నవరం నుంచి పవన్ వారాహి యాత్ర మొదలైంది. కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో జనసేనాని పర్యటించారు. కాకినాడ, ముమ్మడివరం, అమలాపురం, రాజోలు, మలికిపురంలో బహిరంగ సభలో మాట్లాడారు. ఇవే ప్రాంతాల్లో జనవాణి కార్యక్రమాల ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. వాటిని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. సోమవారం పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో వారాహి యాత్ర సాగింది. భీమవరం సభతో ఉభయగోదావరి జిల్లాల్లో వారాహి యాత్ర ముగుస్తుంది.