Pawan Kalyan: పవన్ కల్యాణ్ కదంతొక్కారు. ఎవర్రా మనల్ని ఆపేదంటూ రుషికొండ బాట పట్టారు. పోలీసులు అనేక ఆంక్షలు పెట్టారు. రోడ్డు మీద నుంచే చూడాలంటూ.. కొన్ని వాహనాలకే అనుమతి అంటూ.. ఖాకీలు నానాకొర్రీలు పెట్టారు. జనసేనాని అలానే చేశారు. పోలీస్ చెక్ పోస్ట్ దగ్గరే కారు ఆపేసి.. నడుచుకుంటూ రుషికొండ దగ్గరకు వెళ్లారు. రుషికొండ తవ్వకాలను పరిశీలించారు.
చట్టాలను కాపాడాల్సిన ముఖ్యమంత్రే.. ఇలా చట్టాలను ఉల్లంఘిస్తే ఎలా? అంటూ నిలదీశారు. మిగతా వాళ్లు శాంతియుతంగా నిరసన తెలిపినా.. కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారే.. మీరు మాత్రం ఇలా చట్టవ్యతిరేకంగా కొండను తవ్వేస్తారా? అని పశ్నించారు పవన్ కల్యాణ్. తుఫాను వచ్చినా కొట్టుకుపోకుండా రుషికొండ గ్రామాన్ని కాపాడుతున్న ఈ శతాబ్దాల నాటి కొండను తవ్వడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణను కూడా ఇలానే దోపిడీ చేశారని.. అందుకే అక్కడి నుంచి తన్నితరిమేశారని అన్నారు పవన్. తెలంగాణను దోచింది చాలక.. ఉత్తరాంధ్ర మీద పడ్డారని.. ఇక్కడికి వచ్చి దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్తులనే అడ్డగోలుగా దోచేస్తుంటే.. ఇక ప్రైవేట్ ఆస్తులను వదులుతారా? అని అన్నారు.
ఒక్క రాజధానికే దిక్కులేదు కానీ మూడు రాజధానులు అంటున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రికి అధికారిక భవనం కావాలంటే.. సర్క్యూట్ హౌజ్ ఉంది కదా.. రుషికొండ మీద ఎందుకు పడ్డారని.. ప్రకృతి దృశ్యాలు కావాలా ముఖ్యమంత్రికి? జగన్కు ఇంకా ఎన్ని ఇళ్లు కావాలంటూ ఫైర్ అయ్యారు పవన్ కల్యాణ్.