Pawan Kalyan : రెండో విడత వారాహి యాత్రలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వాలంటీర్ల వ్యవస్థను టార్గెట్ చేశారు. అప్పటి నుంచి ప్రతి సందర్భంలో వాలంటీర్ల కార్యకలాపాలపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా మరోసారి వాలంటీర్ వ్యవస్థ విషయంలో ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించారు.
1. వాలంటీర్లకు బాస్ ఎవరు?
2. ప్రజల వ్యక్తిగత డేటా సేకరించి ఎక్కడ భద్రపరుస్తున్నారు?
3. వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు.. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే అధికారం వారికి ఎవరిచ్చారు? ఈ మూడు ప్రశ్నలకు సీఎం వైఎస్ జగన్ సమాధానం చెప్పాలని జనసేనాని డిమాండ్ చేశారు.
అటు జైజూస్, ఏపీ ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందంపైనా పవన్ ట్విట్టర్ లో పలు అంశాలు లేవనెత్తారు. నష్టాల్లో ఉన్న బైజూస్ కంపెనీకి రూ.కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారని శనివారం ఆరోపణలు చేశారు. ఆ తర్వాత రోజే మరికొన్ని ప్రశ్నలు ట్విట్టర్ లో సంధించారు. రాష్ట్ర ప్రభుత్వం బైజూస్ కంటెంట్ లోడ్ చేసిన ట్యాబ్ల కోసం రూ.580 కోట్లు ఖర్చు చేస్తోందని పేర్కొన్నారు. బహిరంగ మార్కెట్లో ఒక్కో ట్యాబ్ విలువ రూ.18 వేల – రూ.20 వేల వరకు ఉంటుందన్నారు. బైజూస్ సీఈవో రవీంద్రన్ కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా కంటెంట్ లోడ్ చేసి ఇస్తామని అంగీకరించిన విషయాన్ని గుర్తు చేశారు. వచ్చే ఏడాది మళ్లీ ప్రభుత్వం రూ.580 కోట్లు ఖర్చు చేసి ట్యాబ్లు కొననుందా? అని జనసేనాని ప్రశ్నించారు.
ప్రభుత్వం జవాబు చెప్పాల్సిన అంశాలివే అంటూ పలు ప్రశ్నలు సంధించారు పవన్. బైజూస్ కంటెంట్ కోసం వచ్చే ఏడాది నుంచి ఖర్చు ఎవరు భరిస్తారు? కంపెనీ ఏటా ఉచితంగా ఇస్తుందా? ఈ విషయంలో క్లారిటీ లేదని పవన్ పేర్కొన్నారు. 8వ తరగతి విద్యార్థులకు ఏటా బైజూస్ కంటెంట్ లోడ్ చేసిన ట్యాబ్లు ఉచితంగా ఇస్తామని ప్రభుత్వం చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. బైజూస్ సంస్థ మాత్రం ఎక్కడా ఇప్పటి నుంచి ఏటా ఉచితంగా కంటెంట్ ఇస్తామని చెప్పలేదన్నారు.
ఒక వేళ బైజూస్ సంస్థ ఖర్చు భరించలేకపోతే ఆ ఖర్చు ఎవరు భరిస్తారు? ఏపీ ప్రభుత్వమా లేక విద్యార్థులా? అని పవన్ ప్రశ్నించారు. ఒకవేళ ప్రభుత్వం భరిస్తే మరో రూ.750 కోట్లు బైజూస్ కంటెంట్ కోసం ఖర్చు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 8వ తరగతి నుంచి 9వ తరగతిలోకి విద్యార్థులు వెళ్లినప్పుడు వారి పరిస్థితి ఏంటి? 9వ తరగతి కంటెంట్ ఖర్చు ఎవరు భరిస్తారు? అని జనసేనాని సందేహాలు లేవనెత్తారు. బైజూస్ సంస్థ ఏ మాధ్యమంలో, ఏ సిలబస్ అందజేస్తుంది? ఏ విధానం ప్రకారం సిలబస్ రూపొందిస్తున్నారు? అని పవన్ కల్యాణ్ ట్విటర్ లో అనేక ప్రశ్నలు ప్రభుత్వంపై సంధించారు.