Pawan Kalyan latest political news(AP updates): వారాహిపై విజయ యాత్ర చేస్తున్నారు పవన్ కల్యాణ్. తనకు బలమున్న గోదావారి జిల్లాలో నిదానంగా పర్యటిస్తున్నారు. జనవాణితో ప్రజలతో మమేకమవుతూ.. వారి కష్టసుఖాలు తెలుసుకుంటున్నారు. వారాహి పైనుంచే బహిరంగ సభలు నిర్వహిస్తూ.. అధికార పక్షాన్ని దంచిపడేస్తున్నారు. అయితే, పవన్ ప్రసంగాలు మునుపటిలా లేవు. స్పష్టమైన మార్పు ఉంది. తానే సొంతంగా ఎదగాలనే కసి కనిపిస్తోంది. వైసీపీ నేతలను తిట్టడానికి ఎంత సమయం కేటాయిస్తున్నారో.. తన గురించి తాను చెప్పుకోవడానికీ అంతే టైమ్ స్పెండ్ చేస్తున్నారు. తనను నమ్మండి.. తనవెంట ఉండండి.. తనను సీఎంను చేయండి.. అంటూ పదే పదే చెబుతున్నారు. ఒక్క ఛాన్స్ అంటూ వేడుకుంటున్నారు. ప్రజలు తనకు మద్దతిస్తే.. తాను వారి కోసం పని చేస్తానంటూ చాకచక్యంగా మాట్లాడుతున్నారు. తనను గెలిపించలేదు కాబట్టే.. తాను పోరాడలేకపోతున్నానని.. గెలిపించి ఉంటే వైసీపీ ఆగడాలను అడ్డుకునే వాడినంటూ.. ప్రజలను ఆలోచనలో పడేస్తున్నారు.
అయితే, జనసేనాని గతంలో మాదిరి.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను.. పొత్తులు కచ్చితంగా ఉంటాయి.. లాంటి కామెంట్లు చేయట్లేదు. ఎందుకు? పొత్తులు బెడిసికొట్టాయా? అంటే లేదు. చాలాకష్టపడి మరీ.. ఢిల్లీ పెద్దలతో మాట్లాడి మరీ.. చంద్రబాబును అమిత్షా, నడ్డాల చెంతకు చేర్చారు. చర్చలు జరిపించారు. బీజేపీ అగ్రనేతలు ఏపీలో సభలు పెట్టి.. వైసీపీని ఘాటుగా విమర్శించేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పొత్తు పక్కానే అంటున్నారు.
మరెందుకు పవన్ కల్యాణ్ ప్రసంగాలు మారాయి? తనను సీఎం చేయాలని ఎందుకు అడుగుతున్నారు? అటు, చంద్రబాబు, నారా లోకేశ్లు సైతం మరో 10 నెలల్లో వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని గట్టిగా చెబుతున్నారు. అటు టీడీపీ సర్కార్.. ఇటు సీఎం పవన్ కల్యాణ్.. ఏదో కన్ఫ్యూజన్ ఉందంటున్నారు.
వాళ్లు మాత్రం ఫుల్ క్లారిటీతోనే ఉన్నారని తెలుస్తోంది. పొత్తులు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. కొలిక్కి వచ్చేందుకు ఇంకా చాలా సమయమే పడుతుంది. పంపకాలు గట్రా అంత ఈజీ కాదు. ఈ లోగా ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేసుకుపోతున్నారు. తాము ఎంత బలంగా ఉన్నట్టు కనిపిస్తే.. పొత్తుల్లో అన్ని ఎక్కువ సీట్లు సాధించొచ్చు. ఎన్ని సీట్లు ఎక్కువ వస్తే.. అన్నే పదవులు వరించొచ్చు. ఇక కీలకమైన సీఎం పదవి కోసం డిమాండ్ చేయాలంటే.. తనకంటూ చెప్పుకోదగ్గ సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉండాలని జనసేనానే గతంలో చెప్పారు. ఆ లెక్కన.. తన బలం, బలగాన్ని పొంచుకుని.. అది చూపించి.. పొత్తుల్లో పైచేయి సాధించాలనేది పవన్ వ్యూహంగా కనిపిస్తోంది. వారాహి సభలు ఎంత క్లిక్ అయితే.. ఆయనకు అంత డిమాండ్. అందుకే, పదునైన విమర్శలు, ఘాటైన వ్యాఖ్యలు, సవాళ్లతో ఫుల్ యాక్టివ్గా ఉంటున్నారు జనసేనాని. టీడీపీ సైతం ఏమాత్రం తొందరపడకుండా.. పొత్తులు ఉన్నా లేకున్నా.. ఏకంగా 175 స్థానాలపై గురిపెట్టింది. సొంతంగానైనా గెలిచేస్తామనే ధీమాలో ఉంది సైకిల్ పార్టీ. కానీ, ప్రాక్టికల్గా ఆలోచిస్తున్న పవన్ కల్యాణ్ మాత్రం.. పొత్తుల కోసం గట్టి ప్రయత్నమే చేస్తూ.. ఆ సమయం వచ్చేసరికి తన డిమాండ్ మరింత పెరిగేలా.. వారాహి విజయ యాత్ర చేస్తున్నారని అంటున్నారు.