జనసేన పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ నేత, పవన్ కల్యాణ్ పర్సనల్ సెక్రటరీ సందీప్ రాయల్ వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ కండువా కప్పి సందీప్ రాయల్ ను వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ.. పవన్ మాటల మాయలో పడి.. ఇన్నాళ్లూ ఆయనకోసం, పార్టీకోసం కష్టపడి పనిచేశామన్నారు. పవన్ నమ్ముకుంటే.. అందరినీ నట్టేట ముంచేస్తారని విమర్శించారు.
తల్లిదండ్రులెవరూ తమ పిల్లల్ని పవన్ వెంట పంపొద్దని సందీప్ రాయల్ సలహా ఇచ్చారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తా, రాజకీయాల్లో మార్పుతీసుకొస్తా అని చెప్పే పవన్ మాటలు నిలకడలేనివన్నారు. జనసేన పార్టీలో చేరి ఢిల్లీకి లీడర్ అవ్వాలనుకున్న తాను.. ఇప్పుడు గల్లీకి కూడా అవ్వలేకపోయానని వాపోయారు. పవన్ ఒక అహంకారి అన్న సందీప్.. నాదెండ్ల మనోహర్ కూడా అసెంబ్లీకి వెళ్లకూడదని భావించే మెంటాలిటీ ఉంటుందన్నారు. నాదెండ్ల.. హవాలా డబ్బును పార్టీ ఆఫీసుకు పంపి మారుస్తారన్నారు. పవన్ టీడీపీ పంచన చేరి.. జనసేన కేడర్ ను మోసం చేశారన్నారు. 2024 ఎన్నికల్లో జనసేన-టీడీపీ విజయం అసాధ్యమని, వారికి ఓటమి ఖాయమని, జగన్ మరోసారి విజయం సాధించడం తథ్యమని జోస్యం చెప్పారు.