Pawan Kalyan : కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలోని మల్లవల్లి రైతులతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఇక్కడ 2016లో పారిశ్రామికవాడ కోసం 1,460 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. ఎకరాకు రూ.7.50 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే తమకు పరిహారం ఇప్పటికీ అందలేదంటూ భూములిచ్చిన వారు పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మల్లవల్లి పారిశ్రామికవాడలో రైతులను జనసేనాని కలిశారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రైతుల భూములు తీసుకున్న ప్రభుత్వం వారికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కులాలు, పార్టీ, ప్రాంతాల వారీగా రైతులను విడదీయలేమని జనసేన అధినేత అన్నారు. రైతుల్లో ఐక్యత లేకుంటే అనేక సమస్యలు వస్తాయని వివరించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మల్లవల్లి రైతులు సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.
పరిహారం అడిగితే పోలీసులతో కొట్టించారని రైతుల ఆవేదన చెందుతున్నారని పవన్ మండిపడ్డారు. కొంతమంది నడవలేని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరికొందరిని జైలుకు పంపి ఇబ్బందులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులపై దాడి చేసే హక్కు ప్రభుత్వానికి లేదని స్పష్టంచేశారు. పరిస్థితులకు అనుగుణంగా పనిచేసే పోలీసులను తాను తప్పు పట్టనని తెలిపారు. అయితే ప్రభుత్వం, ఎమ్మెల్యేలు చెప్పినట్లే పోలీసులు వింటారని మండిపడ్డారు. రైతుల ఇళ్లలోకి చొరబడితే ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అవుతుందని స్పష్టం చేశారు.
ప్రభుత్వ అవసరాలకు ప్రజల నుంచి భూములు తీసుకోవచ్చని అయితే 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని స్పష్టం చేశారు. మల్లవల్లి రైతులకు న్యాయం జరగలేదన్నారు. పరిహారాన్ని కొందరు రైతులకే ఇచ్చారని ఆరోపించారు. మిగతా రైతులకు వివిధ కారణాలతో పరిహారం ఆపేశారని పవన్ విమర్శించారు.
మల్లవల్లి రైతులకు పరిహారం వచ్చే వరకు అండగా ఉంటామని పవన్ కల్యాణ్ ధైర్యం చెప్పారు. 2016లో అప్పటి టీడీపీ ప్రభుత్వం మల్లవల్లి రైతుల నుంచి భూములు తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. అందుకే బాధిత రైతులకు టీడీపీ అండగా ఉండాలని సూచించారు. బీజేపీ కూడా రైతుల పక్షాన నిలబడాలని కోరారు.