AP: ఏపీ రాజకీయాలు కీలక దశకు చేరుకున్నాయ్. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. అనూహ్య పరిణామాలు. జగన్కు వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకమయ్యే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయ్. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి ఝలక్ తగలడం.. ప్రతిపక్షాలకు మరింత బూస్ట్ ఇచ్చింది. ఇంకాస్త గట్టిగా పోరాడితే.. ఈజీగా జగన్ను గద్దె దించొచ్చని భావిస్తున్నాయి. ఆ బాధ్యతంతా జనసేనాని తన భుజాలపై వేసుకున్నట్టు కనిపిస్తోంది.
ఇటీవలే పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిశారు. ఏపీ బీజేపీ ఇంఛార్జ్తో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోనూ కీలక చర్చలు జరిపారు. ఢిల్లీ నుంచి తిరిగొచ్చాక.. జనసేనాని ఎందుకో కానీ కాస్త సైలెంట్గా ఉన్నారు. పెద్దగా పొలిటికల్ యాక్టివిటీస్ ఏమీ పెట్టుకోలేదు. బహుషా తెరవెనుక వ్యూహాలు రచించే పనిలో బిజీగా ఉన్నారేమో.
కట్ చేస్తే, తాజాగా హైదరాబాద్లోని చంద్రబాబు ఇంటికెళ్లి మరీ ఆయనతో భేటీ అయ్యారు పవన్ కల్యాణ్. ఏపీ రాజకీయాలు, పరిస్థితులపై చర్చించినట్టు తెలుస్తోంది. అయితే, వారిమధ్య పొత్తుల అంశం పక్కాగా ప్రస్తావనకు వచ్చి ఉంటుందని అంటున్నారు. ఢిల్లీ బీజేపీ ఇచ్చిన డైరెక్షన్ గురించి చంద్రబాబుకు పవన్ వివరించారని చెబుతున్నారు.
చంద్రబాబు మోదీని పొగిడింది అందుకేనా?
బీజేపీ-జనసేన-టీడీపీ పొత్తు దిశగా ముందడుగులు పడుతున్నట్టే కనిపిస్తోంది. ఇటీవల ఓ మీడియా సదస్సులో చంద్రబాబు.. ప్రధాని మోదీని తెగ పొగిడేశారు. మోదీ వల్లే దేశం ఈ స్థాయిలో ఉందని ప్రశంసించారు. ప్రత్యేక హోదా కోసమే తాను ఎన్డీయేను వీడానని.. మోదీతో తనకెలాంటి విరోధం లేదని స్పష్టత ఇచ్చారు. చంద్రబాబు ఇలా బహిరంగ వేదికపై మోదీకి కితాబు ఇవ్వడం వ్యూహాత్మకమే అంటున్నారు. జట్టు కట్టేందుకు మేం రెడీ అనే మెసేజ్ ఇచ్చారని చెబుతున్నారు.
వీరమరణం కాదు.. విజయమే..
ఇక, మూడు పార్టీల మైత్రి కోసం అందరికంటే పవన్ కల్యాణే గట్టిగా ప్రయత్నిస్తున్నారు. పొత్తులపై ఎవరూ ఏమీ మాట్లాడొద్దని.. మేలు చేసే నిర్ణయం తానే తీసుకుంటానని కేడర్కు పదే పదే చెబుతూ వస్తున్నారు. ఒంటరిగా యుద్ధానికి వెళ్లి వీరమరణం పొందటం తనకు ఇష్టం లేదని కూడా అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వబోనని చెబుతున్నారు. అదే సమయంలో అవసరమైతే సింగిల్గా పోటీ చేసేందుకు కూడా సై అంటూ సిగ్నల్ ఇచ్చారు. ఇలా చాలాకాలంగా పొత్తులపై బాగా కసరత్తు చేస్తున్నారు జనసేనాని.
అవినాష్ ఎపిసోడ్తో అనుమానాలు?
టీడీపీతో పొత్తుకు మొదట్లో బీజేపీ ససేమిరా అంది. జగన్తో రహస్య స్నేహానికే జై కొట్టింది. కానీ, మారిన పరిస్థితుల దృష్ట్యా బీజేపీలోనూ మార్పు వచ్చిందని అంటున్నారు. అవినాష్రెడ్డికి సీబీఐ ఉచ్చు బిగించడం.. త్వరలోనే ఆయన అరెస్ట్ తప్పదంటూ ప్రచారం.. ఇదంతా మారిన కేంద్ర వైఖరికి నిదర్శణమే అనే విశ్లేషణా వినిపిస్తోంది.
పొత్తులపై బీజేపీకి నచ్చజెప్పడంలో పవన్ సక్సెస్ అయ్యారని తెలుస్తోంది. ఢిల్లీ పెద్దలు జనసేనాని ప్రతిపాదనపై పాజిటివ్గా ఆలోచిస్తున్నా.. ఏపీ బీజేపీ నుంచి మాత్రం కిరికిరి ఎదురవుతోందని చెబుతున్నారు. అంతా ఓకే కానీ.. సీట్ల పంపకాలపైనే అసలు సిసలు తిరకాసు.
సీట్ల పంపకాలు అంత ఈజీనా?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో టీడీపీ ఫుల్ జోష్ మీదుంది. ఇంకాస్త గట్టిగా పోరాడితే ఈసారి అధికారం తమదే అని ధీమాగా ఉంది. లోకేశ్ యువగళం పాదయాత్రకు.. చంద్రబాబు రోడ్షోలకు ప్రజలు భారీగా తరలివస్తుండటంతో.. కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది. తాము సొంతంగానే గెలిచేస్తామనే నమ్మకం చంద్రబాబుది. అయినా, రిస్క్ తీసుకోవద్దనే పొత్తులపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని తెలుస్తోంది. అయితే, మెజార్టీ సీట్లు, సీఎం పదవి తమదేనని.. ఆ విషయంలో తగ్గేదేలే అనేది చంద్రబాబు ప్రతిపాదన.
ఎక్కడ తగ్గాలో తెలిసిందా?
మొదట్లో తక్కువ సీట్లు తీసుకునేందుకు జనసేనాని అస్సలు ఇష్ట పడలేదు. కానీ, పొత్తు లేకుంటే అసలుకే ఎసరు వస్తుందని.. మళ్లీ జగనే సీఎం అవుతారని.. అలా జరగకూడదంటే.. తాము నెగ్గాలంటే.. ఎక్కడ తగ్గాలో తెలుసుకున్నారని అంటున్నారు. అందుకే, కాస్త సీట్లు తగ్గినా.. గౌరవప్రదమైన సంఖ్య ఇస్తే చాలనేది పవన్ ప్రపోజల్ అంటున్నారు. ఆ విషయంపై చర్చించేందుకే చంద్రబాబుతో జనసేనాని భేటీ అయ్యారని సమాచారం. గడిచిన మూడేళ్లలో చంద్రబాబుతో పవన్ భేటీ కావడం.. ముచ్చటగా మూడోసారి.