TDP-Janasena Alliance news(Andhra pradesh election news): ఏపీలో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పావులు కుదుపుతున్నారు. ఇప్పటికే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన ఆయన.. సెకండ్ లిస్ట్ పై కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీ కావడం ఆసక్తిగా మారింది. ఉండవల్లిలోని టీడీపీ అధినేత నివాసానికి జనసేనాని వెళ్లారు. దాదాపు గంటన్నరపాటు ఇరువురు నేతలు చర్చించుకున్నారు. అభ్యర్థుల ఎంపికపై సమాలోచనలు జరిపారు.
మరోవైపు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళతారని తెలుస్తోంది. అందుకే ఇరువురు నేతలు చర్చించుకున్నారని సమాచారం. టీడీపీ-జనసేన కూటమిలో బీజేపీ చేరికపై చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటికి ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు చంద్రబాబు నివాసానికి టీడీపీ నేతలు క్యూకట్టారు. ఎమ్మెల్యే టిక్కెట్ ఆశిస్తున్న నాయకులు ఉండవల్లిలోని ఆయన ఇంటికి తరలి వచ్చారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గౌతు శ్యామ్ సుందర్ శివాజీ చంద్రబాబుతో భేటీ అయ్యారు. సర్వేపల్లి టిక్కెట్ పై సోమిరెడ్డి చర్చించారని తెలుస్తోంది. పలాస ఎమ్మెల్యే టిక్కెట్ తన కుమార్తె గౌతు శిరీష్ కు ఇవ్వాలని గౌతు శ్యామ్ సుందర్ శివాజీ కోరారని సమాచారం.
Read More: ఎన్నికల తర్వాత విశాఖ నుంచే పాలన.. ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తా..
అలాగే శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా టీడీపీ అధినేతను కలిశారు. పెందుర్తికి చెందిన టీడీపీ నాయకుడు బండారు అప్పలనాయుడుతో కలిసి రామ్మోహన్ నాయుడు టీడీపీ అధ్యక్షుడితో భేటీ అయ్యారు. పెందుర్తి టిక్కెట్ ను టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆశిస్తున్నారు. అందువల్లే ఆయన అల్లుడు ఎంపీ రామ్మోహన్ నాయుడు, బండారు అప్పల నాయుడు చంద్రబాబుతో భేటీ అయ్యారు.
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల రెండో జాబితా త్వరలోనే విడుదల కానుందని తెలుస్తోంది. జనసేన పార్టీతో పొత్తు వల్ల కొన్నిస్థానాల్లో సీట్ల సర్ధుబాటు చేయాల్సి ఉంది. అందుకే అటు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, ఇటు టీడీపీ నేతలు చంద్రబాబుతో భేటీ అయ్యి సీట్ల కేటాయింపు చర్చించారని అంటున్నారు.