ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో వారాహి విజయయాత్రలో పవన్ కల్యాణ్ పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మచిలీపట్నంలో మాట్లాడుతూ.. జగన్ తరచూ క్లాస్ వార్ అని చెబుతారు.. మరోసారి ఆ మాట అనవద్దన్నారు. తాను మచిలీపట్నంలో ఉన్నా.. రాయలసీమ నుంచి ఇక్కడికి వచ్చి తమ సమస్యలను చెప్పుకుంటున్నారన్నారు. బడుగు, బలహీన వర్గాలకు తాను నాయకుడిని అని చెప్పుకునే జగన్.. పేదలను దౌర్జన్యంగా ఖాళీచేయించి వీధికి లాగారని దుయ్యబట్టారు. పేపర్లపై పట్టాలు చూపించి ఇళ్లను తొలగించడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. నంద్యాలలో వైసీపీ నేతలు చేస్తున్న దోపీడీ, దౌర్జన్యాలకు సాక్ష్యాలు కూడా ఉన్నాయన్నారు. అన్యాయంగా పేదల ఇళ్లను కూల్చివేసిన వారిపై భవిష్యత్ లో చర్యలు తీసుకుంటామన్నారు.
దివ్యాంగులు, బధిర చిన్నారులు చెప్పిన సమస్యలు విని పవన్ కల్యాణ్ కంటతడి పెట్టుకున్నారు. దివ్యాంగుల కోసం పదకాలు ప్రవేశపెడుతున్నామని ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకోవడమే గానీ.. వారి బాధల్ని పట్టించుకోరని విమర్శించారు. ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే నెలల తరబడి అధికారుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. భవన నిర్మాణ కార్మికుల కోసం జనసేన డొక్కా సీతమ్మ కేంద్రాలు పెట్టినట్లే.. దివ్యాంగుల కోసం కూడా ఒక కార్యక్రం చేపడుతామన్నారు.
దాడికి కుట్ర
పెడనలో రేపు జరగనున్న జనసేన సభలో తనపై దాడికి అధికార పార్టీ నేతలు కుట్రలు చేశారన్నారు. పెడన సభలో రాళ్ల దాడికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. సభను అడ్డుకునేందుకు క్రిమినల్స్ ను దింపారనే సమాచారం ఉందన్నారు. పబ్లిక్ మీటింగ్ లో రాళ్ళ దాడి చేసి గొడవ చేయాలని ప్లాన్ చేశారని ఆరోపించారు. పెడన సభలో గొడవలు సృష్టిస్తే సహించబోమన్నారు. సీఎం, డీజీపీ, ఇతర అధికారులు జరిగే పరిణామాలకు బాధ్యత వహించాలన్నారు. టీడీపీ , జనసేన పొత్తును విచ్ఛిన్నం చేయాలని కుట్ర చేస్తున్నారన్నారు పవన్.