Pawan Kalyan : వైసీపీ ప్రభుత్వ విధానాలపై జనసేనాని పవన్ కల్యాణ్ మరోసారి ఫైర్ అయ్యారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పై మంగళగిరిలో పార్టీ ఆఫీస్ లో రౌండటేబుల్ సమావేశం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలులో జగన్ సర్కార్ అవలంభిస్తున్న విధానాలను తప్పుపట్టారు. జనాభాకు తగ్గట్టు బడ్జెట్ కేటాయింపులు జరగాలన్నారు. ఎస్సీ, ఎస్టీలు 22 శాతం ఉన్నా.. ఇంకా నిధులు ఇవ్వాలని అడగాలా? దేహి అంటే కుదరదు.. పోరాటం చేసే తీసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ సంపూర్ణంగా అమలు జరగాలని జనసేనాని స్పష్టం చేశారు.
ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులు దారి మళ్లించకూడదని పవన్ కల్యాణ్ అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన 27 పథకాలు తీసేశారని చెబుతుంటే చాలా బాధేసిందన్నారు. ఈ మూడేళ్లలో రూ.20 వేల కోట్లు రాకుండా చేశారంటే ఏమనాలి? అని మండిపడ్డారు. ఎన్ని గొప్ప చట్టాలు, సంస్కరణలు తెచ్చినా ఆచరణలో పెట్టాలి కదా? ఆచరణలో పెట్టకపోతే చట్టాలు తెచ్చినా ప్రయోజనం ఉండదన్నారు. ఏపీ ప్రభుత్వం పబ్లిసిటీ కోసం రూ.15 వేల కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. వైసీపీ రంగుల కోసం రూ.21,500 కోట్లు దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ నిధులు వారికి రాకుండా దారి మళ్లించి మోసం చేస్తారా? అని పవన్ కల్యాణ్ నిలదీశారు.
వివక్షకు గురయ్యే కులాలను అర్థం చేసుకోవాలన్నారు జనసేనాని. ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో వివక్షకు గురవుతారని పేర్కొన్నారు. వివక్షకు గురైనప్పుడే దాని గురించి తెలుస్తుందని వివరించారు. సమాజాన్ని సమగ్రంగా చూడాలన్నారు. మన కష్టం, శ్రమకు తగ్గ ఫలితం ఉండాలని స్పష్టం చేశారు.
బయటి శత్రువుల కన్నా మనతోటి ఉండే శత్రువులను కనిపెట్టాలన్నారు పవన్. మన హక్కులను కాలరాసే ఎవరినైనా ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేశారు. సామాజిక పునర్నిర్మాణం చేయాలన్నదే తన తపనని స్పష్టం చేశారు. నమ్మిన సిద్ధాంతానికి నిలబడి ఉండేవాడే నాయకుడు అన్నారు. వ్యక్తి ఆరాధన ప్రమాదకరమని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.