Pawan Kalyan: విశాఖలో వైసీపీ అక్రమాల భరతం పడుతున్నారు పవన్ కల్యాణ్. శుక్రవారం రుషికొండకు వెళ్లి సర్కారు తీరుపై విరుచుకుపడితే.. శనివారం సిరిపురం వెళ్లి ఎంపీ ఎంవీవీ కబ్జాలపై మండిపడ్డారు. ఉత్తరాంధ్రను వైసీపీ నేతలు దోచుకుంటున్నారని.. ప్రశాంతమైన విశాఖలో గొడవలు పెడుతున్నారంటూ జనసేనాని ఫైర్ అయ్యారు.
సిరిపురం CBCNC భూములపై.. 18 క్రైస్తవ సంఘాలకు చెందిన భూములు వివాదంలో ఉన్నాయి. ఇప్పటికే ఆయా సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. అయితే 1800 గజాల స్థలాన్ని తీసుకుని విశాఖ ఎంపీ MVV సత్యనారాయణ.. దాన్ని డెవలప్ చేస్తున్నారు. ఎంపీ ఎంవీవీ సంస్థ నిర్మించే భవనాలను పవన్ కల్యాణ్ పరిశీలించారు. విశాఖలో వైసీపీ నేతల కబ్జాలు విపరీతంగా పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చట్టాలను అతిక్రమించిన వారికి టీడీఆర్ బాండ్లు ఇచ్చారని.. చర్చి ఆస్తులను అడ్డగోలుగా దోచేస్తున్నారని ఆరోపించారు. కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసిన వారితోనే.. ఎంపీ చేతులు కలిపి దందాలు చేస్తున్నారని విమర్శించారు. ఎంపీ.. విశాఖ నుంచి ఎక్కడికో వెళ్లి వ్యాపారం చేస్తానని చెప్పడం సిగ్గుచేటన్నారు పవన్ కల్యాణ్.