Pawan Kalyan latest comments(AP breaking news today): మూడు పార్టీల పొత్తు అని పవన్ పక్కాగా చెబుతున్నారు. ప్రతిపక్ష ఓటు చీలనివ్వబోనని అంటున్నారు. జనసేనాని పదే పదే ఇదే మాట చెబుతున్నారు. కానీ.. ఆ దిశగా పెద్దగా అడుగులేమీ పడుతున్నట్టు కనిపించడం లేదు. చంద్రబాబుతో పవన్ రెండుమూడు సార్లు భేటీ అయ్యారు. ఓసారి బాబును ఢిల్లీ పిలిపించుకుని అమిత్షా, నడ్డాలు చర్చలు జరిపారు. అంతే. మళ్లీ అప్డేట్స్ ఏమీ లేవు. ఎవరి రాజకీయంలో వాళ్లు బిజీగా ఉన్నారు. జనసేనాని వారాహి విజయయాత్రతో చెలరేగిపోతున్నారు. బీజేపీ పెద్దలు ఏపీ టూర్లు, జగన్పై విమర్శలు, రాష్ట్ర పార్టీ అధ్యక్ష మార్పుతో దూకుడు పెంచారు. టీడీపీ మాత్రం యువగళం పాదయాత్ర, చంద్రబాబు సమీక్షలతో ఆ విధంగా ముందుకు పోతోంది.
అంతేనా. ఇక ఇంతేనా. మూడు పార్టీల పొత్తన్నారు? ఏమైంది? మళ్లీ ఎలాంటి భేటీ లేదు? ఎందుకలా? ఢిల్లీ ఎన్డీయే మీటింగ్కు సైతం కేవలం జనసేనకు మాత్రమే ఇన్విటేషన్ వచ్చింది. టీడీపీని పిలుస్తారనుకున్నా.. అలాంటి పిలుపేమీ రాలేదు. చంద్రబాబు పాత స్నేహితుడేగా.. పిలవొచ్చుగా? ఇటీవల చర్చలు జరిపారుగా.. రమ్మనొచ్చుగా? ఇలా పొత్తు పొద్దు పొడిచేందుకు అవకాశాలు ఉన్నా.. ఎందుకోగానీ ఆ దిశగా పాజిటివ్ సిగ్నల్స్ రావడం లేదు. మరి, టీడీపీ, బీజేపీ, జనసేనల పొత్తు ఉంటుందా? అందుకు ఇంకా సమయం ఉందా?
మూడు పార్టీల పొత్తులపై ఢిల్లీలో ఆసక్తికర కామెంట్స్ చేశారు జనసేనాని. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసే పోటీ చేస్తాయన్నారు. అయితే.. టీడీపీ, బీజేపీ మధ్య అండర్స్టాడింగ్ ఇష్యూ ఉందంటూ అసలు విషయం చల్లగా చెప్పారు. వాళ్ల సమస్యలపై తాను మాట్లాడటం సరికాదన్నారు. సమస్యలున్నా కచ్చితంగా కలిసి పోటీ చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. తనకు ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదని.. ఎన్నికల ఫలితాలను బట్టే సీఎం ఎవరనేది నిర్ణయిస్తామమని స్పష్టం చేశారు.
ఢిల్లీలో పవన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. బీజేపీ, టీడీపీ కలిసిపోయాయని అనుకుంటున్న సమయంలో.. ఆ రెండు పార్టీల మధ్య అండర్స్టాండింగ్ ఇష్యూ ఉందని చెప్పడం మామూలు విషయమేమీ కాదంటున్నారు. గతంలో ఎన్డీయేలో ఉండి.. ప్రభుత్వంలో భాగస్వామిగా మారి.. ఆ తర్వాత మోదీని తిట్టి.. ఎన్డీయేను వీడి.. ధర్మపోరాట దీక్షలతో నానారచ్చ చేశారు చంద్రబాబు. ఆ చేదు అనుభవాన్ని బీజేపీ బడానేతలు అంత ఈజీగా మర్చిపోలేకపోతున్నారని తెలుస్తోంది. అయితే, గతంగత:.. అంటూ సైకిల్ని కమలం తోటలో పార్క్ చేసేందుకు పవన్ కల్యాణ్ గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. జనసేనానిపై సదాభిప్రాయంతో ఉన్న బీజేపీ.. ఆయన కోసమైనా అన్నట్టు.. టీడీపీ విషయంలో మనసు మార్చుకుంటోంది. మళ్లీ కలుపుకొని వెళ్లే దిశగా ఆలోచిస్తోంది. అయితే, అందుకు కాస్త సమయం పట్టేలా ఉందంటున్నారు. రెండు పార్టీల మధ్య ఉన్న అండర్స్టాండింగ్ ఇష్యూని.. పవన్ ప్రత్యేకంగా డీల్ చేస్తున్నారు. జగన్ను ఓడించాలంటే.. మూడు పార్టీల పొత్తు తప్పనిసరి అని నచ్చజెప్పుతున్నారు. ప్రస్తుతానికి ఇష్యూ ఉన్నా.. అది త్వరలోనే సాల్వ్ అవుతుందని.. 2014 నాటి పొత్తు మళ్లీ సాధ్యమేనని అంటున్నారు.