Pawan Kalyan : 2024లో టీడీపీ-జనసేన ప్రభుత్వం రాబోతోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. మంగళగిరిలో కొందరి నేతలకు పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించిన పవన్ కల్యాణ్ .. తాను ఏదైనా మాటల్లో చెప్పను.. చేతల్లో చూపిస్తానని స్పష్టం చేశారు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని చెప్పకున్నారు. కానీ ఇచ్చిన మాట కోసం ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడ్డానన్నారు. డబ్బుల కోసమే సినిమాలు చేస్తున్నానని.. పాలిటిక్స్ తనకు సేవ అని పేర్కొన్నారు. అవినీతి చేయాల్సిన అవసరం తనకు లేదని పవన్ స్పష్టం చేశారు.
వైసీపీ ప్రభుత్వ విధానాలపై పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. దోపిడి చేస్తూ దౌర్జన్యం చేసే వారిని ఎదుర్కొనాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో జగన్ డబ్బులు వసూలు చేసుకునేవారని ఆరోపించారు. ఇప్పుడు ఏపీలో పాలన అలాగే ఉందన్నారు. అందుకే జగన్ పై ఎదురు తిరగాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు చెందిన అమర్ రాజా ఫ్యాక్టరీని ఎలా లేకుండా చేశారని వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు పవన్. ఫ్యాక్టరీ అంటే వ్యక్తి కాదని వేల కుటుంబాలకు ఉపాధి ఇచ్చేదని పేర్కొన్నారు.
2024 ఎన్నికలు ఎంతో కీలకమని జనసేనాని అన్నారు. త్రిముఖపోరు జరిగితే 2-3 శాతం ఓట్ల తేడాతో జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే.. ఏపీ మళ్లీ నష్టపోతుందన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావు, ఉద్యోగాలు ఉండవన్నారు. కొద్ది మంది చేతిలో అధికారం ఉంటుందని.. అలా జరగకూడదనే టీడీపీతో జతకట్టానని వివరించారు. వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనని పవన్ మరోసారి స్పష్టం చేశారు. తాను ఇగో పెట్టుకోలేదని ప్రజలు గెలవాలన్నదే తన లక్ష్యమని తేల్చిచెప్పారు.