విశాఖపట్నంలో వారాహి విజయ యాత్ర చేపట్టిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గాజువాక బహిరంగ సభలో వైసీపీ టార్గెట్ గా మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజలు జగన్ను సీఎం చేసింది ప్రభుత్వ ఆస్తులు అమ్మడానికా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తులను ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద రూ.25 వేల కోట్లకు తనఖా పెట్టేశారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ భూములను కాజేస్తున్నారని విమర్శించారు. గంగవరం పోర్టులో 10 శాతం అదానీకి రాసిచ్చారని మండిపడ్డారు.
దేవుడని జగన్ను గెలిపిస్తే అధికారం చేపట్టాక దెయ్యంలా పీడిస్తున్నారని జనసేనాని ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణలో ఏపీకి రావాల్సిన రూ.లక్ష కోట్ల ఆస్తుల పంపకాలు జరగలేదన్నారు. జగన్కు చెందిన రూ. 300 కోట్ల ఆస్తుల కోసం రాష్ట్రానికి రావాల్సిన ఆస్తులను ఆ రాష్ట్రానికి వదిలేశారని ఆరోపించారు. 2019 ఎన్నికల సమయంలో టీడీపీ ప్రభుత్వం ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరించిందని జగన్ చేసిన ఆరోపణలను పవన్ గుర్తు చేశారు. అదే ప్రశ్న తాను ఇప్పుడు వేస్తే సీఎం ఎందుకు సమాధానం చెప్పడంలేదని నిలదీశారు. 2.5 లక్షల మంది వాలంటీర్లకు యజమాని ఎవరు? అని ప్రశ్నించారు. వాలంటీర్లు సేకరించిన సమాచారాన్ని ఎక్కడ భద్రపరుస్తున్నారు? అని అడిగారు.
రుషికొండ ఎదురుగా ఉన్న కొండపై నిర్మించిన వేంకటేశ్వరస్వామి ఆలయంపై తాను మాట్లాడలేదని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారని పవన్ మండిపడ్డారు. కొండపై దేవుడు ఉంటాడు. కానీ క్రిమినల్ కాదన్నారు. జగన్.. గద్దె దిగిపో.. పులివెందుల ఎస్టేట్కో, బెంగళూరు ప్యాలెస్కు పారిపో అంటూ పవన్ హెచ్చరికలు చేశారు. పచ్చని కొండలను తొలిచేసేసి.. ప్రకృతి వనరులను దోచుకుంటున్నారని మండిపడ్డారు.
సీఎం జగన్ ప్రజల కోసం ఏదైనా అడిగితే ప్రధాని మోదీ ఎందుకు నెరవేర్చరు? అని పవన్ అన్నారు. కేసులున్న వ్యక్తులకు మోదీ, అమిత్ షాను అడిగే ధైర్యముండదని తెలిపారు. ప్లకార్డు పట్టుకుని పార్లమెంటులో కూర్చొనే ధైర్యం లేదంటూ వైసీపీ ఎంపీలను ఉద్దేశించి విమర్శలు చేశారు. తాను అమిత్ షా కార్యాలయానికి వెళ్లి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు ఇవ్వాలని అడిగానని తెలిపారు. కానీ వైసీపీ ఎంపీలు ఎందుకు అడగలేకపోతున్నారని విమర్శించారు. విశాఖ ఎంపీ సహా వైసీపీ ఎంపీలదంరూ మైనింగ్ వ్యాపారులు, కాంట్రాక్టర్లేనని అన్నారు. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ 2018లో రౌడీషీటర్ అని పవన్ అన్నారు. ఆయన చర్చిల ఆస్తులు దోచుకున్నారని ఆరోపించారు. సిరిపురంలో ఎంపీ అక్రమంగా నిర్మిస్తున్న భవనాలను ప్రభుత్వం మారగానే కూల్చేస్తామని హెచ్చరించారు.
తాను సీఎం కావాలంటే ప్రజల ఆశీర్వాదం కావాలని జనసేనాని స్పష్టం చేశారు. పదేళ్లు ఏ పదవీ ఆశించకుండా పని చేశానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు సీఎం పదవి చేపట్టడానికి సంసిద్ధంగా ఉన్నానని మనసులో మాట చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వమైనా, సంకీర్ణ ప్రభుత్వమైనా రావాలి. జగన్ లేని పాలన చూడాలి అని పవన్ కొత్త స్లోగన్ అందుకున్నారు. వచ్చే ఎన్నికల్లో యువత ఆలోచించి ఓటేయాలని పిలుపునిచ్చారు. జగన్ పాలనలో యువతకు ఉపాధి అవకాశాలు దక్కలేదన్నారు. 2024 ఎన్నికల్లో గాజువాకలో జనసేన జెండా ఎగురుతుందని జనసేనాని విశ్వాసం వ్యక్తం చేశారు.