Pawan Kalyan : మూడో విడత వారాహి విజయయాత్రకు విశాఖలో శ్రీకారం చుట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై మరోసారి ఘాటు విమర్శలు చేశారు. జగదాంబ కూడలిలో నిర్వహించిన బహిరంగ సభలో జగన్ ను వీరప్పన్తో పోలుస్తూ ఆరోపణలు చేశారు. వీరప్పన్ అమాయక గిరిజనులతో గంధపు చెట్లను నరికిస్తే.. జగన్ వాలంటీర్లతో ప్రజల డేటా కొట్టేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి కంపెనీని వాటాలు అడుగుతున్నారని ఆరోపించారు. ఇసుక, మట్టి అన్నీ దోచుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. విశాఖలో భూదందాలు బయటకు తీస్తానని జనసేనాని హెచ్చరించారు. దోషులను ప్రజల ముందు నిలబెడతానని స్పష్టం చేశారు.
వైసీపీ నేతల అరాచకాలను కేంద్రం చాలా సీరియస్గా తీసుకుందని పవన్ అన్నారు. సహజ వనరులను దోచుకుంటున్నవారి చిట్టా కేంద్రం వద్ద ఉందని వెల్లడించారు. కేంద్రంతో కలిసి ఆట ఆడిస్తానంటూ సీఎం జగన్ కు వార్నింగ్ ఇచ్చారు. సీఎం ఉదయం ఓ పథకం ద్వారా నగదు ఇచ్చి.. సాయంత్రం మద్యం కింద ఆ డబ్బును లాగేస్తున్నారని విమర్శించారు. జగన్ అధికారులను ఆత్మీయంగా పిలుస్తూ కీలక దస్త్రాలపై సంతకాలు చేయించి చట్ట వ్యతిరేక పనులు చేయిస్తారని పవన్ విమర్శించారు. సీఎం మాటల వెనుక స్వార్థ ప్రయోజనాలుంటాయని మండిపడ్డారు. ఇప్పటికే ఉన్నతాధికారులు చాలామంది కేసుల్లో ఇరుక్కున్న విషయాన్ని గుర్తు చేశారు. అందుకే అధికారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
గూండాలు, కబ్జాదారులు, రియల్ ఎస్టేట్ రాబందుల చేతుల్లో విశాఖ విలవిల లాడుతోందని పవన్ అన్నారు. ప్రకృతి విపత్తులను తట్టుకున్న రుషికొండను తవ్వేశారని మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ కోసం ఎర్రమట్టి దిబ్బలను తవ్వేస్తున్నారని ఆరోపించారు. ఈ విధ్వంసాలను ఆపేందుకు ధైర్యంగా బయటకు రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. విశాఖలో కాపురం పెడతానంటున్న సీఎం జగన్ రుషికొండలో కాకుండా పరవాడలోని ఫార్మా కాలుష్యం మధ్య ఉంటే జనం బాధలు తెలుస్తాయన్నారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదని పవన్ స్పష్టం చేశారు. 2024లో జగన్ చేతిలోకి అధికారం వెళ్లకూడదన్నదే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఏపీలో 30 వేల మంది మహిళలు అదృశ్యమైతే సీఎం ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఎప్పుడూ తన పెళ్లిళ్ల గురించి మాట్లాడటం తప్ప రాష్ట్ర సమస్యలు పట్టించుకోరా? అని నిలదీశారు. ఆంధ్ర యూనివర్సిటీ వైసీపీ కార్యాలయంగా మారిందన్నారు. ఏయూ వీసీ విద్యార్థుల కోసం పనిచేస్తున్నారా? వైసీపీ కోసం పనిచేస్తున్నారా? అని ప్రశ్నించారు. జగన్ కు మరో అవకాశం ఇస్తే ఏపీని ఎవరూ కాపాడలేరని పవన్ హెచ్చరించారు.
వారాహియాత్రలో పోలీసులు అనేక ఆంక్షలు విధించారు. జనసేనానికి స్వాగతం పలికేందుకు ఎయిర్ పోర్టుకు వెళ్లిన కార్యకర్తలను లోపలికి అనుమతించలేదు. సభాస్థలికి వెళ్లే దారులను కిలోమీటరు ముందే బారికేడ్లతో మూసేశారు. జనసేన కార్యకర్తలు నిరసనకు దిగడంతో లాఠీలు ఝుళిపించారు.
మరోవైపు మాజీ మంత్రి, విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం నుంచి గతంలో 3సార్లు టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన పడాల అరుణ పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. రెండోరోజు వారాహియాత్ర కొనసాగనుంది.