Pawan Kalyan: నాలుగు పెళ్లిళ్లు చేసుకొని రోడ్డెక్కారంటూ ఇటీవల సీఎం జగన్ పవన్ కల్యాణ్పై కామెంట్ చేశారు. భీమవరం వారాహి విజయయాత్రలో జగన్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు జనసేనాని. తాను పాలసీల గురించి మాట్లాడుతుంటే.. వ్యక్తిగత విషయాలు ప్రస్తావిస్తూ.. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ మండిపడ్డారు.
తాను లండన్లో పెరిగి, న్యూయార్క్లో చదువుకోలేదని.. తానూ ఇక్కడివాడినేనని.. జగన్ హైదరాబాద్లో ఏమేం చేశారో తనకు చాలా బాగా తెలుసన్నారు. జగన్ గురించి లోతైన విషయాలు కూడా చాలాబాగా తెలుసని హెచ్చరించారు. మంత్రుల చిట్టా మొత్తం విప్పగలనని అన్నారు. వ్యక్తిగత విషయాలు మాట్లాడలేక కాదు.. ఇవన్నీ చిల్లర విషయాలని.. అందుకే తాను మాట్లాడనని చెప్పారు పవన్.
మిస్టర్ జగన్మోహన్రెడ్డి.. చెవులు రిక్కించి విను.. అంటూ సూటిగా చెప్పారు జనసేనాని. జగన్ గురించి ప్రతీ విషయం తెలుసని.. “మీ మనుషులను పంపించు.. నేను చెప్పే విషయాలు వింటే చెవుల నుంచి రక్తం కారుతుంది”.. అంటూ హెచ్చరించారు. తన గురించి ఎంత వాగినా.. తనకేమాత్రం ఫరక్ పడదని.. వెంట్రుకతో సమానమని అన్నారు.
జగన్ గుర్తుపెట్టుకో.. ఫ్యాక్షన్, రౌడీ, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అని ఎగురుతున్నారేమో.. విప్లవ స్పూర్తితో వచ్చిన వాడిని.. పోరాటం చాలా చాలా గట్టిగా ఉంటది.. చిల్లర చిల్లర మాటలు మాట్లాడితే ఊరుకోబోమని.. వారాహి వేదికగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పవన్ కల్యాణ్.
ఢిల్లీలో తనకు పరపతి ఉందని.. దేశాన్ని పాలించే వారు తనకు చాలా సన్నిహితులని అన్నారు. జగన్ చేస్తున్న అవినీతి దందాల గురించి పూర్తి రిపోర్ట్ తన దగ్గరా,కేంద్ర దగ్గరా ఉందని.. తాను తలుచుకుంటే జగన్ సంగతి తేల్చేస్తానని హెచ్చరించారు.