Pawan Kalyan : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ మధ్య దూకుడు మరింత పెంచారు. సందర్భం దొరికితే చాలు వైఎస్ఆర్ సీపీ సర్కార్ పై విరుచుకుపడుతున్నారు. తాజాగా మంగళగిరిలో ఇప్పటం ఇళ్లు కూల్చివేతల బాధితులకు రూ. లక్ష చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. తనకు అండగా ఉన్న ఇప్పటం ప్రజలకు తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు. పరిహారం ఇవ్వకుండా ఇళ్లు కూల్చడం బాధ అనిపించిందన్నారు. కూల్చివేతలో పద్ధతి పాటించలేదని ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. ఇదే సమయంలో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో జనసేనాని మండిపడ్డారు. వైఎస్ఆర్ సీపీ గడప కుల్చేదాకా వదిలి పెట్టనని హెచ్చరించారు.
టార్గెట్ సజ్జల
ఎప్పుడూ నేరుగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే జనసేనాని ఈ సారి టార్గెట్ మార్చారు. ప్రభుత్వ సలహాదారు, వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు. సజ్జల డిఫ్యాక్టో సీఎంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటం గ్రామంలో ఇళ్లు కూల్చివేతల వెనుక సజ్జల పాత్ర ఉందని ఆరోపించారు. రాజకీయ కక్షలతోనే ఈ చర్యలకు పాల్పడ్డారని మండిపడ్డారు. వైఎస్ఆ ర్ సీపీ నేతలకు సంస్కారం, మంచి, మర్యాద తెలియదని విమర్శించారు. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ ఎలా గెలుస్తుందో చూస్తానని జనసేనాని సజ్జలకు ఛాలెంజ్ విసిరారు. ప్రధాని మోదీతో ఏం మాట్లాడానో సజ్జలకు చెప్పాలంటా… నా దగ్గరకు రండి చెవిలో చెబుతా అని సెటైర్లు వేశారు.
వైఎస్ఆర్ సీపీ నేతల ఇళ్లు కూల్చుతాం…
తాము అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ సీపీ నేతల ఇళ్లు కూల్చుతామని జనసేనాని హెచ్చరించారు. చట్ట ప్రకారం వైఎస్ఆర్ సీపీ నేతల ఇళ్లు పడగొడతామన్నారు.
తగ్గేదే లే..
తాను అన్నింటికి సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఉడతఊపులకు భయపడనని స్పష్టం చేశారు. ఎవరూ నోరు తెరిచి మాట్లాడకూడదా అని వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జనసేనను రౌడీసేన అని వైఎస్ఆర్ సీపీ నేతల విమర్శించడంపై మండిపడ్డారు. జనసేన విప్లవ సేన అని పేర్కొన్నారు. వైఎస్ఆర్ సీపీ రాజకీయ పార్టీనా ఉగ్రవాదసంస్థా అని ప్రశ్నించారు.
యుద్ధం నేనే చేస్తా..
వైఎస్ఆర్ సీపీని దెబ్బకొట్టాలంటే ప్రధానికి చెప్పి చేయనని పవన్ అన్నారు. బీజేపీ నేతలకు చెప్పకుండా తన యుద్ధం తానే చేస్తానని స్పష్టం చేశారు. తాను ఢిల్లీకి వెళ్లి చాడీలు చెప్పనని తేల్చిచెప్పారు. ఆంధ్రలోనే పుట్టాను. ఆంధ్రాలో తేల్చుకుంటానని స్పష్టం చేశారు. సగటు మనిషికి న్యాయం జరిగేలా పోరాటం చేస్తానన్నారు. ఇప్పటం ప్రజల మాదిరిగా రైతులు తెగువ చూపించి ఉంటే అమరావతి రాజధాని కదిలేదు కాదని పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.