Pawan Kalyan : జనసేనాని పవన్ కల్యాణ్ బీసీల ఓట్లకు గాలం వేసే పనిలో పడ్డారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో బీసీ సదస్సు నిర్వహించారు. రాష్ట్రంలోని బీసీ కులాలన్నీ కలిస్తే రాజ్యాధికారం ఇంకెవరికీ దక్కదన్నారు. ఇన్నేళ్లుగా బీసీల ఐక్యత ఎందుకు సాధ్యం కాలేదో అర్థం కావట్లేదన్నారు. గతంలో 93 ఉన్న బీసీ కులాలు ఇప్పుడు 140కు ఎందుకు పెరిగాయని పవన్ ప్రశ్నించారు. బీసీలకు జనసేన అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
తెలంగాణలో 26 కులాలను బీసీల జాబితా నుంచి తొలగించడంపై బీఆర్ఎస్ వివరణ ఇవ్వాలని పవన్ కల్యాణ్ కోరారు. కొన్ని బీసీ కులాలను ఆ జాబితా నుంచి తొలగించడంపై వైసీపీ, టీడీపీ స్పందించాలన్నారు. చట్టసభల్లో సంఖ్యా బలం లేని బీసీలకు ఏం చేయగలం అనే దానిపై ఆలోచిస్తానన్నారు. మీ ఓట్లే మీకు పడవు అని బీసీలను హేళన చేస్తున్నారని తెలిపారు. బీసీ అభ్యర్థిని నిలబెట్టినప్పుడు అందరూ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. తనను ఒక కులానికి పరిమితం చేసి బీసీ నాయకులతో తిట్టిస్తున్నారని మండిపడ్డారు. తనను బీసీలతో తిట్టిస్తే రెండు వర్గాల వారు గ్రామస్థాయిలో ఘర్షణకు దిగుతారని తెలిపారు. తాను ఒక కులానికి మాత్రమే నాయకుడిని కాదని స్పష్టంచేశారు. ప్రజలందరికీ నాయకుడిగా ఉండాలనుకుంటున్నానని పవన్ కల్యాణ్ తెలిపారు.
ఏపీలో ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉంది. మళ్లీ అధికారం నిలబెట్టుకునేందుకు సీఎం జగన్ పావులు వేగంగా కదుపుతున్నారు. గ్రామస్థాయి నుంచి కార్యకర్తలను, నాయకులను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. సంక్షేమ పథకాలే గెలిపిస్తాయన్న ధీమాతో ఉన్నారు. బీసీల ఓట్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. గతేడాది మంత్రివర్గంలో మార్పులు చేసినప్పుడు బీసీ మంత్రుల సంఖ్యను పెంచారు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలకే ఎక్కువ మంది అవకాశం కల్పించారు. ఇలా బీసీల ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. అటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఓట్లు వైసీపీకే పడతాయన్న ధీమాలో ఉన్నారు. ఇలా అధికారం నిలబెట్టుకోవచ్చననేది జగన్ విశ్వాసం.
అటు టీడీపీ బీసీల ఓట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. గత ఎన్నికల్లో బీసీలు చాలా వరకు దూరం కావడం వల్లే ఓటమిపాలయ్యాయమని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే బీసీ ఓట్లు తిరిగి సాధించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. టీడీపీ బీసీల పార్టీ అని పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. ఇటు యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టిన నారా లోకేశ్ .. బీసీ కులాలతో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. టీడీపీలో
బీసీలకు మరింత ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇస్తున్నారు. ఇలా తండ్రీకొడుకులు బీసీ మంత్రం జపిస్తూ ముందుకుసాగుతున్నారు.
ఏపీలో దాదాపు 50 శాతం ఓట్లు బీసీలవే ఉన్నాయి. అందుకే అన్నీ పార్టీలు బీసీ మంత్రం పఠిస్తున్నాయి. ఒకప్పుడు బీసీల్లో ఎక్కువ శాతం ఓట్లు టీడీపీకి పడేవి. బీసీల్లో కొన్ని కులాల్లో ఓట్లు సైకిల్ కొల్లగొట్టేది. అయితే గత ఎన్నికల్లో బీసీ ఓటర్లను ఆకట్టుకోవడంలో జగన్ సఫలమయ్యారు. ఇప్పుడు ఆ ఓట్లను నిలబెట్టుకుంటారా? టీడీపీ తిరిగి బీసీ ఓట్లపై పట్టు సాధిస్తుందా..? బీసీలు జనసేనాని ఆదరిస్తారా..? ఏపీలో బీసీ ఓటర్లు ఎటువైపు..?
FOR MORE UPDATES PLEASE FOLLOW : https://bigtvlive.com/andhra-pradesh