Janasena: వచ్చే ఎన్నికల్లో కూటమి గెలుపే లక్ష్యంగా జనసేన ఇప్పటికే కసరత్తుల మొదలుపెట్టింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ సభలు నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్.. జనసేన అభ్యర్థుల తరఫున ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్లను నియమించారు.
జనసేన అభ్యర్థుల తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో ప్రచారం చేసి ప్రజల్లో జోష్ నింపడానికి పార్టీ అధినే పవన్ కళ్యాణ్ స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు, క్రికెటర్ అంబటి రాయుడు, డ్యాన్స్ మాస్టర్ జానీ మాస్టర్, సినీ నటులు సాగర్, పృథ్వీ, హైపర్ ఆది, గెటప్ శ్రీనులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ప్రచారకర్తలుగా నియమించారు.
ఈ స్టార్ కాంపెయినర్లు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నిర్వహించే ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించనున్నారు. వీరంతా తన అభిమానులను జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసేలా ప్రసంగాలు చేయనున్నారు.
టీడీపీ, బీజేపీతో పొత్తులో భాగంగా జనసేనకు రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో 21 అసెంబ్లీ స్థానాలు దక్కాయి. 25 పార్లమెంట్ స్థానాల్లో జనసేనకు 2 సీట్లు దక్కిన విషయం తెలిసిందే. కాగా, పొత్తులో భాగంగా జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్నారు.