TDP Janasena BJP Alliance: ఏపీలో ఎన్నికల వేడి మరింత పెరిగింది. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించాయి. ఒకవైపు సిద్ధం సభలతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. సింగిల్ గా పోటీకి సై అంటూ విపక్షాలు సవాల్ విసురుతున్నారు.
మరోవైపు టీడీపీ-జనసేన ఉమ్మడిగా ఇప్పటికే తాడేపల్లిగూడెంలో బహిరంగ సభ నిర్వహించాయి. అలాగే చిలకలూరిపేటలో టీడీపీ, జనసేన , బీజేపీ కలిసి బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇంకోవైపు ఎమ్మెల్యే సీట్ల సర్దుబాటుపై ఈ మూడు పార్టీల కసరత్తు కొనసాగుతోంది.
ఇటీవల టీడీపీ, జససేన, బీజేపీల మధ్య పొత్తు కొలిక్కి వచ్చింది. అయితే బీజేపీ, జనసేన పోటీ చేసే సీట్ల సంఖ్య తేలిపోయింది. పోటీ చేసే స్థానాలపై కాస్త చిక్కుముడి ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఉండవల్లిలోని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నివాసంలో చర్చలు జరుగుతున్నాయి. టీడీపీ చీఫ్ తో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ , బీజేపీ జాతీయ నాయకుడు బైజయంత్ పండా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.
Read More: నిడదవోలులో జనసేన పోటీ.. అభ్యర్థి ప్రకటన..
మూడు పార్టీల మధ్య పొత్తులో భాగం టీడీపీ 145 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది. జనసేన, బీజేపీ కలిసి 30 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తాయి. అయితే గతంలోనే జనసేనకు 24 స్థానాలను చంద్రబాబు కేటాయించారు. ఇప్పుడు జనసేన, బీజేపీకి కలిసి 30 సీట్లు ఇచ్చారు.
బీజేపీ 6 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. అలాగే జనసేన, బీజేపీకి 8 లోక్ సభ సీట్లను టీడీపీ కేటాయించింది. అంతకు ముందు జనసేనకు 3 ఎంపీ సీట్లు ఇచ్చింది. కానీ జనసేన ఒక ఎంపీ సీటు బీజేపీకి ఇస్తుందని వార్తలు వస్తున్నాయి. అంటే బీజేపీ 6 లోక్ సభ స్థానాల్లో, జనసేన రెండు చోట్ల పోటీ చేస్తాయని తెలుస్తోంది.
ఏ పార్టీ ఎక్కడ పోటీ చేయాలన్నదానిపైనే ప్రధానంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో బీజేపీ, జనసేన నేతలు భేటీ అయ్యారు.