Janasena latest updates(Political news in AP) : వైసీపీకి రాజీనామా చేసిన పెందుర్తి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. రెండు,మూడు రోజుల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలవబోతున్నానని ఆయనే స్వయంగా తెలిపారు. జనసేన నేతలతో చర్చలు తర్వాత పార్టీలో చేరే అంశంపై అధికారికంగా ప్రకటన చేస్తానని స్పష్టం చేశారు. అభిమానులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ నెల 17న పంచకర్ల జనసేన కండువాకప్పుకుంటారని తెలుస్తోంది. నిన్నటి వరకు ఆయన విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. గురువారమే ఆ పార్టీకి షాకిచ్చారు. పార్టీ అధ్యక్ష పదవితోపాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి తొలిసారిగా పెందుర్తి నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో టీడీపీలో చేరి ఎలమంచలి నుంచి రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. గత ఎన్నికల్లో అక్కడ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు.
2021 ఆగస్టులో పంచకర్ల వైసీపీలో చేరారు. ఆ తర్వాత ఆయనకు విశాఖ జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. వచ్చే ఎన్నికల్లో పెందుర్తి నుంచి బరిలోకి దిగాలని ఆయన భావించారు. అయితే వైసీపీ అధిష్టానం నుంచి టిక్కెట్ పై హామీ రాలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీలో చేరి రెండేళ్లు గడవక ముందే వైసీపీకి గుడ్ బై చెప్పారు.