Janasena latest updates(political news in AP): మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలిశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. పవన్ తోపాటు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్తో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ నెల 20న జనసేనలో చేరతానని పంచకర్ల ప్రకటించారు. పార్టీలో ఏ బాధ్యత అప్పగించినా నిర్వహిస్తానని స్పష్టం చేశారు. పంచకర్ల చేరికతో విశాఖలో జనసేన బలం పెరుగుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
ఇటీవల వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్ష పదవితోపాటు పార్టీ సభ్యత్వానికి పంచకర్ల రమేష్ బాబు రాజీనామా చేశారు. ఆ సమయంలో వైసీపీలో పరిణామాలపై తీవ్ర విమర్శలు చేశారు. పార్టీలో తనకు స్వేచ్ఛ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని విషయాలు సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నించినా అవకాశం రాలేదని తెలిపారు. అందుకే వైసీపీని వీడుతున్నానని ప్రకటించారు. ఆ తర్వాత జనసేనలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు.
వచ్చే ఎన్నికల్లో పంచకర్ల రమేష్ బాబు పెందుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇక్కడ నుంచే ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి బరిలోకి దిగి ఎలమంచిలిలో గెలిచారు. అదే స్థానం నుంచి 2019లో టీడీపీ తరఫున పోటీ చేసి వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత రెండేళ్లకు టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. 2 ఏళ్లు గడవక ముందే వైసీపీని వీడారు. వచ్చే ఎన్నికల్లో జనసేన నుంచి పెందుర్తి బరిలోకి దిగాలని పంచకర్ల ప్రయత్నిస్తున్నారు.