Palnadu Politics : పల్నాడు మరోసారి యుద్ధానికి సిద్ధమవుతోంది. అధికార పార్టీలో రాజకీయం కాక రేపుతోంది. 2024 ఎన్నికల కోసం వైసీపీ నేతలు కత్తులు నూరుతున్నారు. వర్గపోరుపై నాయకత్వం కూడా పట్టీపట్టనట్టు వ్యవహరిస్తోంది. మరి, కార్యకర్తల సంగతేంటి?
ఆంధ్రప్రదేశ్ వణుకుతోంది. చలికే కాదు.. రాజకీయ పార్టీల అధినేతలు చెప్తున్న మాటలతో నాయకులు కూడా వణికిపోతున్నారు. వైనాట్ 175 అంటూ ఒంటరి పోరుకు సిద్ధమైంది వైసీపీ. అభ్యర్థుల మార్పుపై అధిష్టానం సీరియస్గా దృష్టి పెట్టింది. గురజాల నియోజకవర్గంలోనూ అభ్యర్థి మార్పు తప్పదని జోరుగా ప్రచారం జరుగుతోంది. కొత్తగా ఓసీ అభ్యర్థి, పాత బీసీ నాయకుడి పేర్లు తెరపైకి వస్తున్నాయి. వాళ్ల ప్రయత్నాలు కూడా జోరుగా సాగుతున్నాయి. ఒకరికి ఇద్దరు, ముగ్గురు తెరపైకి రావడంతో వైసీపీ సాధికారత బస్సుయాత్ర సైతం గురజాలలో నిర్వహించకపోవడం చర్చగా మారింది.
ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అధిష్టానం తనకే ఎమ్మెల్యే టికెట్ ఇస్తుందని బహిరంగంగా చెప్తున్నారు. వైఎస్ ఫ్యామిలీతో అనుబంధం కలిసొస్తుందని ధీమా. ఇప్పటికి మూడుసార్లు పోటీ చేస్తే రెండుసార్లు గెలిచానంటూ గుర్తుచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా తనను ఎమ్మెల్సీ చేసి.. విప్గా గౌరవించారని చెప్పుకుంటున్నారు. నియోజకవర్గంలో బీసీ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో బీసీ అయిన తనకే టికెట్ ఖాయమంటూ జంగా కృష్ణమూర్తి నమ్మకం. సిట్టింగ్ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి నియోజకవర్గంలో తనకు 61 శాతం మద్దతున్నట్లు చెప్తున్నారు. గురజాల అభివృద్ధి తనతోనే సాధ్యమైందని.. మెడికల్ కాలేజీతో పాటు అవినీతికి తావు లేకుండా చేసిన పనులే తనకు మరో ఛాన్స్ ఇస్తాయని నమ్మకంతో ఉన్నారు.
గురజాల నియోజకవర్గంలో హడావుడి చేస్తున్న మరో నేత ఎనుముల మురళీధర్ రెడ్డి. అభ్యర్థి మార్పు జరిగితే ఓపెన్ కేటగిరీలో నాయకత్వం తన పేరును పరిగణలోకి తీసుకునే అవకాశం ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. నియోజకవర్గంలో పరిచయాలు, బంధుగణం, అభిమానులు ఉండడంతో పాటు.. పల్నాడులోని ఓ కీలక ఎమ్మెల్యే అండదండలు మురళీధర్ రెడ్డికి కలిసొచ్చే అంశాలు.
వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి స్థానికేతరుడు. ఈ అంశాన్ని మిగతావాళ్లు హైలైట్ చేస్తున్నారు. స్థానికులకే ఛాన్సివ్వాలనే డిమాండ్ తెరపైకి తెస్తున్నారు. ఇక్కడ టీడీపీ నుంచి బలమైన నేత యరపతినేని శ్రీనివాసరావు ఉన్నారు. అంగబలం, అర్థబలం, సామాజిక బలం ఆయన సొంతం. ఆ స్థాయి నేత స్థానికంగా లేకపోవడంతో 2019లో నరసరావుపేట నుంచి లీడర్ను వైసీపీ దిగుమతి చేసుకుంది. కాసుపై ఇప్పటికే అధిష్ఠానానికి చాలా ఫిర్యాదులు వెళ్లాయి. జంగా కృష్ణమూర్తికి, మహేష్ రెడ్డికి పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. మురళీధర్ రెడ్డికి జగన్ భార్య భారతి రెడ్డితో బంధుత్వం ఉంది. వీళ్లతో పాటు కొమ్మినేని వెంకటేశ్వర్లు, డాక్టర్ మల్లికార్జునరావు పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
రాయలసీమ తర్వాత ఆ తరహా రాజకీయానికి వేదిక పల్నాడు. అందులో కీలకమైన నియోజకవర్గం గురజాల. వైసీపీ మూడు సార్లు సర్వే చేయించింది. ప్రస్తుత ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డిని నరసరావుపేట వెళ్లాలని అధిష్టానం చెప్పినట్లు సమాచారం. మరి జగన్ మదిలో ఉన్న మరో అభ్యర్థి ఎవరన్నది చూడాలి. మరోసారి జనాభిప్రాయం సేకరించి మహేష్రెడ్డినే కొనసాగిస్తారా.. మరొకరికి ఛాన్స్ ఇస్తారా అన్నది చూడాలి.
.
.