Palnadu: పల్నాడు జిల్లా క్రోసూరు గ్రామ పంచాయతీ ఆఫీసు కార్యాలయాన్ని పంచాయతీ కార్మికులు ముట్టడించారు. 8 నెలల బకాయిని వెంటనే చెల్లించాలని పారిశుద్ధ్య కార్మికులు ఆఫీసుకు తాళాలు వేసి ఆఫీసు ముందు బైఠాయించారు. జగనన్న పుట్టిన రోజున బయట నుంచి కూలీలను తీసుకువచ్చి వీధులను శుభ్రం చేయటం ఏమిటని కార్మికులు ప్రశ్నించారు.
పండుగకు జీతాలు ఇవ్వకపోతే మేము ఎలా బతకాలని పారిశుద్ధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు జీతాలు ఇచ్చే వరకూ ఆఫీసు ముందు బైఠాయించి కదిలేదే లేదని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఇప్పటికైనా స్పందించి.. తమకు జీతాలు ఇప్పించాలని కార్మికులు వేడుకుంటున్నారు.
జీతాలు చెల్లించకపోవడంతో.. కార్మికులు పారిశుద్ధ్య పనులను నిలిపివేశారు. దాంతో గ్రామంలో చెత్తా చెదారం కుప్పలు తెప్పలుగా పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. చెత్త ఇలానే పేరుకుపోయి ఉంటే.. అంటువ్యాధులు ప్రబలుతాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.