Tirumala Laddu: కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల. తిరుమలకు స్వామి వారి దర్శనం కోసం నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఆ శ్రీనివాసుడి దర్శనంతో పునీతులవుతారు భక్తులు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా పిలువబడే శ్రీ శ్రీనివాసుడి ప్రసాదంకు ప్రపంచ కీర్తి ఉంది. తిరుమల అన్న ప్రసాదం నుండి లడ్డు ప్రసాదం వరకు ప్రతీదీ మధురాతి మధురం. అటువంటి పవిత్ర ప్రసాదం తయారీలో భాగస్వామ్యం కావడం కూడా ఒక పుణ్యకార్యంగా భక్తులు, సిబ్బంది విశ్వసిస్తారు. తిరుమల ప్రసాదం తయారీకి ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. అందులో లడ్డు తయారీకి సంబంధించి నియమనిష్టలను అవలంబిస్తారు.
లడ్డు తయారీకి ఉపయోగించే ప్రతి పదార్థం నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. లడ్డు తయారీకై భారీ స్థాయిలో జీడిపప్పును వినియోగిస్తారు. జీడిపప్పు లేని తిరుమల లడ్డూను కూడా ఊహించలేమని అంటుంటారు భక్తులు. కాగా ఇటీవల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించారన్న ఆరోపణలు వినిపించిన నేపథ్యంలో టీటీడీ అలర్ట్ అయింది. స్వామి వారి ప్రసాదం తయారీలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా టీటీడీ ప్రత్యేక శ్రద్ద తీసుకుంది. కాగా తిరుమల లడ్డు తయారీకి ఉపయోగించే శనగలు, జీడిపప్పులను భక్తుల నుండే సేకరిస్తారు. సేంద్రీయ ఎరువులను ఉపయోగించి పండించిన శనగలను మాత్రమే టీటీడీ సేకరిస్తోంది. రైతుల నుండి సేకరించే సమయంలో వాటిని పరీక్షించి, ఏ ఎరువు వాడారు.. రసాయనిక ఎరువుల ప్రభావం ఉందా అన్నది కూడా టెస్టింగ్ చేయడం ఆనవాయితీ. ఇది ఇలా ఉంటే తిరుమల క్షేత్రానికి శనగలు ఇచ్చే భాగ్యం కలగడం తమకు దక్కిన అదృష్టంగా భావిస్తారు రైతన్నలు.
పలాస నుంచి తిరుమలకు జీడిపప్పు
శ్రీవారి లడ్డూ తయారీకి 30 టన్నుల జీడిపప్పును పంపిన ఎస్ఎస్ఎస్ ఆగ్రో ప్రోడక్ట్స్
50 ఏళ్ళ తర్వాత తొలిసారి పలాస నుంచి తిరుమలకు జీడిపప్పు
జీడిపప్పు వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించిన కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్నాయుడు, రాష్ట్రమంత్రి… pic.twitter.com/aLr5cXbVEM
— BIG TV Breaking News (@bigtvtelugu) September 26, 2024
అలాగే జీడిపప్పు సేకరణ కూడా ఇలా పలు కంపెనీల నుండి టీటీడీ సాగిస్తుంది. ఇందుకు నాణ్యతా ప్రమాణాల అర్హతగా సదరు కంపెనీలను గుర్తించి అవకాశాన్ని కల్పిస్తుంది. ఇలా ఏపీలోని పలాస ప్రాంతంలో జీడిపప్పు సాగు అధికంగా సాగుతుంది. గతంలో ఇక్కడి జీడిపప్పును టీటీడీ సేకరించేది. ఆ తరువాత పలాస జీడిపప్పు సేకరణను నిలిపివేసిన టీటీడీ.. తాజాగా పలాసకు చెందిన ఎస్ఎస్ఎస్ ఆగ్రో ప్రోడక్ట్స్ నుండి సేకరణ ప్రారంభించింది. 50 ఏళ్ల తరువాత శ్రీవారి లడ్డూ తయారీకి 30 టన్నుల జీడిపప్పును పలాస నుండి తరలిస్తుండగా.. కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీషలు గరుడ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు.
Also Read: Tirumala Laddu issue: వైసీపీ పాపప్రక్షాళన? తిరుమలకు జగన్, అన్ని ఆలయాల్లో పూజలు చేయాలంటూ పిలుపు!
ఇలా 50 ఏళ్ల తరువాత పలాస జీడిపప్పుకు కలిగిన భాగ్యంపై ఎస్ఎస్ఎస్ ఆగ్రో ప్రోడక్ట్స్ అధినేత సంతోష్కుమార్ మాట్లాడుతూ.. సాక్షాత్తు శ్రీనివాసుడు కొలువైన తిరుమల లడ్డు ప్రసాద తయారీకి జీడిపప్పును అందించడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఏదిఏమైనా ఎన్నో ఏళ్ళకు కలిగిన భాగ్యంపై పలాస ప్రజలు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎంతైనా శ్రీ శ్రీనివాసుడి ప్రసాదంలో పలాస జీడిపప్పుకు చోటు దక్కడం గొప్ప వరమనే చెప్పవచ్చు.