అమరావతి, స్వేచ్ఛ: ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలవుతున్నా ఇంకా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టడంలేదని పలు విమర్శలొస్తున్నాయి. నిధులు పుష్కలంగానే ఉన్నా పనలు మాత్రం పెండింగ్ లోనే ఉన్నాయి. సూపర్ సిక్స్ అంటూ ఎన్నికల ముందు ప్రచారం చేసిన వాటిలో కొన్నింటిని మాత్రమే అమలు చేశారు. మహిళలకు సంబంధించిన గ్యాస్ సిలిండర్లు దీపావళి కానుకగా ప్రకటించారు.
ఇక మిగిలిన వాటిపై ఎందుకు ఫోకస్ చేయడం లేదని ప్రతిపక్ష నేతలు విమర్శలు సంధిస్తున్నారు. కూటమి నేతలు కూడా ఈ ప్రశ్నలకు సమాధానాలు దాటేస్తున్నారు. అయితే త్వరలోనే వీటన్నింటికీ సమాధానం ఇవ్వనున్నారు చంద్రబాబు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూనే ఉన్నారు. ఇచ్చిన మాట ప్రకారం వెనక్కి తగ్గబోమని క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే ఈ పథకాల ఆలస్యం వెనక ఓ బలమైన కారణమే ఉందంటున్నారు రాజకీయ పండితులు.
టీడీపీ ప్రభుత్వం వచ్చీ రాగానే ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. అది కేవలం ఆరు నెలల కాల పరిమితికే. పూర్తి స్థాయి బడ్జెట్ కు సమయం ఆసన్నమయింది. బహుశా డిసెంబర్ తొలి వారంలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టవచ్చని అనుకుంటున్నారు.
ఇప్పటికే పెండింగ్ పథకాలకు ఎంత ఖర్చవుతుంది లెక్కలు పక్కాగా వేసుకున్నాక..వాటికి రాబోయే బడ్జెట్ లో సంవత్సరానికి సరిపడ బడ్జెట్ ను వేసి ఆ పథకాలు ఎక్కడా ఆటంకం లేకుండా కొనసాగాలని భావిస్తున్నారు. ఇప్పటికే సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్లు ప్రకటించిన కూటమి ప్రభుత్వం దానికి అయ్యే ఖర్చు సంవత్సరానికి మూడు వేల కోట్ల రూపాయలు. అలాగే తల్లికి వందనం పథకానికి సంవత్సరానికి పదిహేడు వేల కోట్ల రూపాయలు.
వాస్తవానికి ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పథకాలకు ఏడాదికి గాను అయ్యే ఖర్చు కోటి ఇరవై లక్షల రూపాయలు అవసరమవుతాయని ప్రాధమిక అంచనా. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం సంక్షేమ పథకాలపై పెట్టిన ఖర్చు రూ.70 వేల కోట్లు. అప్పటి ప్రభుత్వం కన్నా అదనంగా మరో నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. వీటికి ఆదాయం ఎక్కడినుంచి సమకూరుతుందని అధికారులు లెక్కలు కడుతున్నారు.
Also Read: ఆడ బిడ్డల రక్షణ, జీరో క్రైమ్ మా టార్గెట్, పోలీసు అమరవీరులకు సీఎం చంద్రబాబు నివాళి
పూర్తిగా కేంద్రం ఇచ్చే నిధులపైనే కాకుండా రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు కూడా అన్వేషిస్తున్నారు. ఇప్పటికే ప్రైవేటు టెండర్ల ద్వారా లిక్కర్ పై భారీ ఆదాయాన్ని తెచ్చుకోగలిగారు. ప్రపంచ బ్యాంకు కూడా బాబు కోరినన్ని నిధులు ఇవ్వడానికి రెడీగానే ఉంది. కేంద్రం ప్రత్యేక గ్రాంట్ల ద్వారా రాజధాని, పోలవరం వంటి ప్రాజెక్టులకు నిధులు సమకూరుస్తానని చెబుతోంది. ఇవి కాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెంచిన పింఛన్లు అన్నీ అవరోధం లేకుండా ఇవ్వాల్సి ఉంటుంది. వచ్చే ఆదాయానికి సరిపడ నిధులు సమకూరే విధానాలపై అధికారులు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు.
ఏ ఏ పథకానికి ఎంతెంత నిధులు కేటాయించాలో..ప్రజలపై భారం పడకుండా పన్నుల వసూల్లు ఎలా చేయాలో అన్నీ ఓ కొలిక్కి రావాలంటే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాక తేలుతుంది. అందుకే బడ్జెట్ తర్వాత సంక్ఝేమ పథకాలపై కసరత్తు ముమ్మరంగా చేయాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. ప్రతిపక్ష నేతల విమర్శలకు సరైన సమాధానం చెప్పే పనిలో నిమఘ్నమై ఉంది కూటమి ప్రభుత్వం.