Ongole : ఏపీలో ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. వైసీపీలో సీట్ల మార్పు కాకరేపుతోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాపై జగన్ ఫోకస్ పెట్టడంతో ఆ ప్రాంతం నేతల్లో గుబులు రేగుతోంది. ఈ క్రమంలోనే ఒంగోలు రాజకీయం తాడేపల్లి చేరుతోంది.
ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డితో సీఎం జగన్ సమావేశం కానున్నారు. నియోజకవర్గాల మార్పుపై ప్రధానంగా చర్చ జరగనుందని సమాచారం. కొన్నాళ్లుగా పార్టీ నాయకత్వం తీరుపై బాలినేని అసంతృప్తితో ఉన్నారు. తన నియోజకవర్గంలో కొందరి పెత్తనం ఏంటంటూ ఆయన నిలదీస్తున్నారు. ఇప్పటికే దఫదఫాలుగా చర్చలు జరిపారు.
నియోజకవర్గాల మార్పుపై సీఎం జగన్ మరోసారి చర్చించనున్నారని తెలుస్తోంది. వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్రెడ్డిని ఒంగోలు నుంచి పార్లమెంట్కు పోటీ చేయిస్తారనే టాక్ నడుస్తోంది. సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు రాఘవను మార్కాపురం నుంచి అసెంబ్లీకి బరిలో నిలపాలనే ప్రతిపాదన కూడా ఉందని తెలుస్తోంది. అటు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బాలినేనికి స్థానచలనం తప్పదనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సీట్ల మార్పు జగన్ తీసుకునే నిర్ణయాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.