Kotamreddy Sridharreddy : నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలే ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. తాను ఆధారాలు మాత్రమే బయటపెట్టానని.. ఈ విషయంపై కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసి ఉంటే బాగుండేదని అన్నారు. విచారణ జరిపితే రాష్ట్ర ప్రభుత్వ పారదర్శకత బయటపడేదన్నారు.
తనను అరెస్ట్ చేస్తారేమోనని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. అరెస్టుకు రంగం సిద్ధమని లీకులు ఇస్తున్నారని తెలిపారు. తనను ఎప్పుడైనా సరే అరెస్టు చేసుకోండి అని సవాల్ చేశారు. శాశ్వతంగా జైల్లో పెట్టండన్నారు. అయినా సరే వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. తన గొంతు ఆగాలంటే ఎన్ కౌంటర్ చేయడం ఒక్కటే పరిష్కారమన్నారు.
పార్టీ మార్పుపైనా క్లారిటీ ఇచ్చారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అనుమానించిన చోట ఉండకూడదని తాను భావించనన్నారు. నిజాయతీగా తన అధికారాన్ని వదులుకున్నానని స్పష్టం చేశారు. నామినేషన్లకు ముందు రోజు పార్టీ నుంచి బయటకు వస్తే తప్పని.. కానీ తాను అలా చేయలేదన్నారు. అధికార పార్టీకి దూరం అవుతుంటే ఎన్ని ఇబ్బందులు వస్తాయో తెలుసన్నారు. తాను కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని కాదన్నారు. 35 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నవాడినని ఇక తన మనసు విరిగిందని తెలిపారు. తాను ఆరాధించిన జగన్ ప్రభుత్వంలో తన ఫోన్ ట్యాపింగ్కు గురైందని ఆధారాలు చూపించి బయటకు వచ్చానన్నారు. నెల ముందు వరకు పార్టీ మార్పుపై తనకు ఎలాంటి ఆలోచనలు లేవన్నారు. ఫోన్ ట్యాపింగ్పై ఆధారం దొరికాక పార్టీకి దూరమయ్యాయని తెలిపారు.
10 మంది మంత్రులు, పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు, సలహాదారులు తనపై ఎలా మాట్లాడారో ప్రజలు గమనిస్తున్నారని కోటంరెడ్డి తెలిపారు. వాళ్లకి సమాధానం చెప్పాలనే ఉద్దేశంంతోనే తన వద్ద ఉన్న ఆధారం బయటపెట్టానన్నారు. మొత్తంమీద వైసీపీకి కొరకురాని కొయ్యలా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మారారు. అందుకే ఆయనను పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ బాధ్యతల నుంచి వైసీపీ అధిష్టానం తప్పించింది. మరోవైపు కోటంరెడ్డి టీడీపీలో చేరతారని ప్రచారం సాగుతోంది. మరి అధికారికంగా నిర్ణయాన్ని ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.