Jagan Posted on Social Media: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ ఆసక్తికరమైన పోస్ట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘దేవుడి దయ, ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజున మన పార్టీ అధికారంలోకి వచ్చింది. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికి మంచి చేసింది. ప్రజలందరి దీవెనలతో మరోసారి ఏర్పాటుకానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనిసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులను ముందుకువేస్తుంది’ అంటూ సీఎం జగన్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
అయితే, ఐదేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. 2019 మే 30న వేలాది మంది అభిమానుల హర్షధ్వానాల మధ్య ఆయన ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. సరిగ్గా మధ్యాహ్నం 12.23 గంటలకు జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో అట్టహాసంగా జగన్ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదాపుగా 40 వేల మందికి పైగా ప్రజలు హాజరయ్యారు. ఏపీ సీఎంగా ప్రమాణం చేసి నేటికి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా జగన్ ఈ విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
Also Read: అనుమతి లేకుండా సచివాలయం నుంచి ఏం తీసుకెళ్లొద్దు: జీఏడీ
ఏపీలో ఈ నెల 13న అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈసారి ఎన్నికల్లో పోలింగ్ శాతం కూడా భారీగా పెరిగింది. ఫలితాల విషయమై అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి.. ఏ పార్టీ అధికారంలోకి రాబోతున్నదంటూ ఎదురు చూస్తున్నారు. ఇటు పార్టీల నేతలు కూడా తమ పార్టీనే అధికారంలోకి వస్తదంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ ట్వీట్ చేస్తూ తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి నేటి ఐదేళ్లు అయ్యిందంటూ ఆనందం వ్యక్తం చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో రెండోసారి కూడా వైసీపీనే అధికారంలోకి రాబోతుందని.. రాష్ట్రం అభివృద్ది విషయంలో ఇంకా ముందుకు వెళ్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.