Vizag : విశాఖపట్నంలో ఓ వార్డు వాలంటీర్ దారుణానికి ఒడుగట్టాడు. బంగారు నగల కోసం ఓ వృద్ధురాలిపై దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటన పెందుర్తి పరిధిలోని సుజాత నగర్లో జరిగింది. వాలంటీరే నిందితుడని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కోటగిరి శ్రీనివాస్ సుజాతనగర్ లో ఉంటున్నారు. ఆయన జీవీఎంసీ 95వ వార్డు పురుషోత్తపురంలో ఫాస్ట్ఫుడ్ సెంటర్ నడుపుతున్నారు. ఆయన వద్ద వార్డు వాలంటీర్ రాయవరపు వెంకటేశ్ పార్ట్టైమ్ పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో శ్రీనివాస్ ఇంటికి వెంకటేశ్ వెళ్లి.. మళ్లీ దుకాణం వద్దకు వచ్చాడు.
ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటలకు కోటగిరి శ్రీనివాస్ ఇంటికి వెళ్లారు. అప్పటికి ఆయన తల్లి 72 ఏళ్ల వరలక్ష్మి అచేతనంగా మంచంపై పడి ఉన్నారు. ఆమె మెడలోని బంగారు గొలుసు మిస్సైంది. వెంటనే శ్రీనివాస్ ఈ విషయాన్ని డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం తెలిపారు. వెంటనే పెందుర్తి పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. గదిలో పరిసరాలను పరిశీలించారు. సీసీ టీవీ ఫుటేజీను పరిశీలించగా.. వార్డు వాలంటీరు వెంకటేశ్ ఆ ఇంటికి వచ్చినట్లు గుర్తించారు.
నిందితుడు వెంకటేశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యపై వివరాలు సేకరించారు. వృద్ధురాలి మెడలోని గొలుసు దొంగిలించడం కోసమే హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. వరలక్ష్మిని వాలంటీర్ తలగడతో ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడని అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం విశాఖపట్నం కేజీహెచ్కు తరలించారు.
ఏపీలో కొన్నాళ్లుగా వాలంటీర్ల వ్యవస్థపై రాజకీయ దుమారం రేగుతోంది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రెండో విడత వారాహి విజయ యాత్రలో ఈ వ్యవస్థపై పదేపదే విమర్శలు చేశారు. వాలంటీర్ల వల్లే ఏపీలో మహిళలు మిస్సవుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఒంటరి మహిళలను వాలంటీర్లు టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు.
మరోవైపు పవన్ ను టార్గెట్ చేస్తూ మంత్రులు, వైసీపీ నేతలు ఘాటుగా విమర్శలు చేశారు. వాలంటీర్లు రాష్ట్రవ్యాప్తంగా పవన్ కల్యాణ్ దిష్టిబొమ్మలు దగ్ధం చేసి నిరసన తెలిపారు. తమ మనోభావాలను దెబ్బతీశారంటూ జనసేనానిపై ఓ మహిళ వాలంటీర్ విజయవాడ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. అయినా సరే పవన్ వాలంటీర్ల వ్యవస్థపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ప్రజల వ్యక్తి డేటా ఎందుకు సేకరిస్తున్నారని ప్రశ్నించారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా వాలంటీర్ వ్యవస్థపై మండిపడ్డారు. ఇప్పుడు వార్డు వాలంటీరే ఓ వృద్ధురాలిని హత్య చేయడంపై వైసీపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.